విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అలమండ- కంతకపల్లి వద్ద ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం- రాయగడ్ ప్యాసింజర్ రైలు ను పలాస ఎక్స్ ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం రోజు 8:30 గంటల సమయంలో.. అలమండ- కంతకపల్లి వద్ద ఒక్కసారిగా ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవటంతో.. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. అయితే.. అదే సమయంలో వచ్చిన పలాస ఎక్స్ప్రెస్ రాయగడ్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో.. రాయగడ ప్యాసింబర్ రైలులోని వెనుక మూడు బోగీలు పట్టాలు తప్పటమే కాకుండా.. తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తుండగా.. చాలా మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం క్షతగాత్రుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది.
అయితే.. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కాగా.. విద్యుత్ వైర్లు తెగిపోవటంతో.. ప్రమాద స్థలం మొత్తం అందకారం అలుముకుంది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెల్ఫోన్ల వెలుగుల్లోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలం రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉండటంతో.. అంబులెన్సులు కూడా చేరుకోటానికి ఇబ్బంది ఏర్పడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బోగీల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో.. చాలా మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులందరిని వీలైనంత తొందరగా ఆస్పత్రులకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులతో పాటు.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ కు.. విశాఖ కేజీహెచ్కు తరలిస్తున్నారు. అయితే.. బోగీలు తుక్కు తుక్కు కావటంతో.. వాటిల్లో ఎంత మంది చిక్కుకున్నారు.. ఎంత మందికి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉందన్నది తెలుసుకోవటం కష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa