ఖతార్లో మరణ శిక్ష పడిన 8 మంది మాజీ నేవీ అధికారులకు భారత మాజీ సైనికులు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంలో మీరు వెంటనే జోక్యం చేసుకొని విడిపించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ‘ఇండియన్ ఎక్స్సర్వీస్ మూవ్మెంట్ (ఐఈఎస్ఎం)’ పేరిట లేఖ రాశారు. మాతృభూమిని కాపాడటం కోసం.. ప్రజలకు రక్షణగా నిలవడం కోసం.. ప్రాణ త్యాగానికి సైతం సైనికులు వెనుకాడరని.. మన భవిష్యత్తు కోసం సైనికులు జీవితాన్ని త్యాగం చేస్తారని.. కానీ విదేశీ గడ్డ మీద మన సైనికులకు మరణశిక్ష పడటం తమను షాక్కు గురి చేసిందన్నారు.
8 మంది భారత మాజీ నేవి అధికారులు గతేడాది ఆగస్టు 30 నుంచి ఖతార్లో ఉంటున్నారని.. అర్ధరాత్రి సమయంలో ఎలాంటి కారణాలు లేకుండానే అకస్మా్త్తుగా వారిని అదుపులోకి తీసుకొని నిర్బంధించారని ప్రధాని మోదీకి రాసిన లేఖలో మాజీ సైనికులు ప్రస్తావించారు. నేవీ అధికారులను విడిపించి, భారత్కు రప్పించాలని కోరుతూ.. 2022 నవంబర్ 28 నుంచి ఇప్పటి వరకూ ప్రధాని మోదీకి 8 లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఖతార్లో తమ వారికి మరణ శిక్ష పడిన విషయం తెలియగానే వారి కుటుంబ సభ్యులు షాకయ్యారని మాజీ సైనికులు తెలిపారు.
మరణ శిక్ష పడిన మన నేవీ అధికారులను తక్షణమే విడిపించి, స్వదేశానికి రప్పించడానికి ప్రధాని మోదీ నేరుగా జోక్యం చేసుకొని ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడాలని మాజీ సైనికులు అభ్యర్థిస్తున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడాన్ని సైనికులు గౌరవంగా భావిస్తారని.. కానీ వారికి పరాయి దేశంలో ఇలాంటి శిక్ష పడటం అక్రమమని, ఆమోదయోగ్యం కాదని ఐఈఎస్ఎం తెలిపింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతంపై భారత్, ఖతార్ మధ్య ఎంఓయూ కుదిరిందని.. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండటంతోనే దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ మన నేవీ అధికారులను ఉద్యోగాల్లోకి తీసుకుందని.. ఇలాంటి పరిస్థితుల్లో వారికి మరణ శిక్ష విధించడం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రధానికి రాసిన లేఖలో ఐఈఎస్ఏం స్పష్టం చేసింది.
ఇండియన్ ఎక్స్సర్వీస్మెన్ మూవ్మెంట్ చైర్మన్ మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ మాట్లాడుతూ.. మన నేవీ అధికారులు ఖతార్ నేవీకి శిక్షణ ఇవ్వడం కోసం వెళ్లారని.. వారికి అక్రమంగా మరణశిక్ష విధించారని.. ఇంతకు మించి దారుణం మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దేశానికి సాయం చేయడానికి వెళ్లినప్పుడు ఇలా మరణ శిక్ష విధించడం ఎందుకు ఎలా అనేది అంతు చిక్కడం లేదన్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి వెంటనే జోక్యం చేసుకొని వారిని విడిపించేందుకు శాయశక్తులా కృషి చేయాలని ఆయన అభ్యర్థించారు. ఒక్క సైనికుడి ప్రాణం కూడా పోకుండా చూడాలని కోరారు. ప్రధాని మోదీ వ్యక్తిగత స్థాయిలో చొరవ తీసుకొని ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సత్బీర్ సింగ్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa