ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొవిడ్ బాధితులకు కేంద్రం అలర్ట్,,,,దేశంలో పెరుగుతున్న గుండె పోటు మరణాలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 30, 2023, 10:42 PM

కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపించింది. 2019 లో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్.. ఇప్పటికీ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉంది. ఇక కొవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మందిలో కరోనా అనంతర సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఇటీవలి కాలంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత, మధ్య వయసు ఉన్న వారు అకస్మాత్తుగా గుండె పోటుకు గురై మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారికి గుండె పోటుకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే సందేహాలు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.


గుండెపోటు రావడానికి కారణం, దాన్ని రాకుండా నివారించేందుకు మార్గాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ చేసిన అధ్యయనాన్ని ఉదహరించిన మన్‌సుఖ్ మాండవీయ.. గతంలో కొవిడ్ బారిన పడి కోలుకున్న వారికి కొన్ని హెచ్చరికలు చేశారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాధితులు.. ఒకట్రెండు ఏళ్ల పాటు ఒత్తిడి, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని సూచించారు. ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా చూసుకుంటే గుండె పోటు నుంచి తమను తాము రక్షించుకోవచ్చని సలహ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గుండె పోటు కారణంగా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్‌ చేసిన అధ్యయనాన్ని మన్‌సుఖ్ మాండవీయ వివరించారు.


కరోనా సోకి తగ్గిన వారు గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే.. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రెండేళ్ల వరకూ కఠిన ఎక్సర్‌సైజ్‌లకు దూరంగా ఉండాలని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులకు గుండె పోటు వస్తుందా అనే దానిపై ఐసీఎంఆర్ ఒక వివరణాత్మక అధ్యయనం చేసిందని మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఆ అధ్యయనం ప్రకారం తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకూడదని సూచించారు. అలాంటి వారు ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలని.. వ్యాయామం, పరుగు తక్కువ చేయాలని పేర్కొన్నారు. అధిక వ్యాయామం నుంచి ఒక సంవత్సరం లేదా అవసరమైన దానికంటే ఎక్కువ కాలం దూరంగా ఉంటే గుండె పోటు నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా గుజరాత్‌లో గార్బా డ్యాన్స్‌లు చేసిన క్రమంలో గుండె పోటు కారణంగా అనేక మరణాలు సంభవించాయి. దీంతో గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ కార్డియాలజిస్టులు, వివిధ వైద్య నిపుణులతో సమావేశాన్ని నిర్వహించారు. గుండెపోటుకు గల కారణాలను తెలుసుకోవడానికి నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని వైద్య నిపుణులను రుషికేష్ పటేల్ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa