ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ-విజయవాడ మధ్య వారం రోజుల పాటు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 05:41 PM

విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. నవంబరు 6 నుంచి 12వ తేదీ వరకు గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, రాజమండ్రి- విశాఖ (07466) మెమూ, విశాఖ- రాజమండ్రి (07467) మెమూ రద్దయ్యిందని చెప్పారు. అలాగే, ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. అలాగే, దీపావళి పండగ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.


ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటం వల్ల చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్‌ (06073) ప్రత్యేక రైలు నవంబరు 13, 20, 27 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి మర్నాడు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అనంతరం 11.20 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు భునేశ్వర్‌కు చేరుకుంటుందని అన్నారు. భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌ (06074) ప్రత్యేక రైలు నవంబరు 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుందని వివరించారు.


అలాగే, సూరత్‌-బ్రహ్మపుర (09069) ప్రత్యేక రైలు నవంబరు 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.20గంటలకు సూరత్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర-సూరత్‌ (09070) ప్రత్యేక రైలు నవంబరు 10, 17, 24, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి.. ఉదయం 7.10గంటలకు పెందుర్తికి, 8.20గంటలకు దువ్వాడకు చేరుకుంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa