ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మగడ్డకు సొంతూరిలో ఓటు హక్కు.. ఏపీ సర్కారుపై మరోసారి గెలిచిన మాజీ ఎస్ఈసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 05:36 PM

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎట్టకేలకు తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆయన ఓటు హక్కును పొందారు. సొంతూర్లో ఓటు హక్కును పొందడం కోసం ఆయన హైకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సొంతూళ్లో తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ.. రమేశ్ కుమార్ గతంలో చీఫ్ ఎలక్టోరల్ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ ఊళ్లో నివాసం ఉండటం లేదనే కారణంతో దుగ్గిరాలలో ఓటు హక్కు కల్పించేందుకు నిరాకరించారు. దీంతో సొంతూరిలో ఓటు హక్కు కోసం ఆయన పోరాటం చేశారు.


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తనకు దుగ్గిరాలలో ఇల్లు, ఆస్తులు ఉన్నాయని, తన తల్లి కూడా ఆ ఊళ్లోనే ఉంటున్నారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది జులైలో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఓటు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆయనకు న్యాయస్థానం సూచించింది. ఆయన దరఖాస్తుపై నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. తాజాగా దుగ్గిరాలలోని ఓటర్ల జాబితాలో ఆయన వివరాలు కనిపించాయి.


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన సమయంలో.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుతో ఆయన విబేధించారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 2020 మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియగా... నూతన ఎస్ఈసీగా జస్టిస్ కనకరాజన్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 2020 ఏప్రిల్ 11న హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో మరో 11 పిటిషన్లు సైతం నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణలో స్వతంత్రత పెంచేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని.. ఎస్ఈసీపై రాజకీయ ఒత్తిళ్లు ఉండొద్దనేది తమ అభిమతమని ప్రభుత్వం వాదించింది. అయితే ఎస్ఈసీగా రమేశ్ కుమార్‌నే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయన హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. చివరకు ఏపీ ప్రభుత్వం మరోసారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నే ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. ఆ తర్వాత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినప్పటికీ.. ఎస్ఈసీ వినిపించుకోలేదు. దీంతో జగన్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa