ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ లేదు. ఎన్డీయేతో సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ.. ఆ కూటమిలో అయితే చేరలేదు. ఇక ‘ఇండియా’ కూటమి వైపు జగన్ పార్టీ కన్నెత్తి కూడా చూడటం లేదు. అయితే ఇండియా కూటమి రాష్ట్రాల సీఎంలు కులగణనకు మొగ్గు చూపుతుండగా.. జగన్ సర్కారు సైతం ఈ దిశగానే అడుగులేస్తుండటం గమనార్హం. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో 38 అంశాలపై చర్చ జరగ్గా.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కులగణన చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోన్న సంగతి తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి, అధికారంలోకి వస్తే.. కేవలం రెండు గంటల్లోనే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అక్టోబర్ 28న జరిగిన ఛత్తీస్గఢ్లోని బస్తర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ హామీ ఇచ్చారు.
బిహార్లో కులగణన..
ఇప్పటికే బిహార్ ప్రభుత్వం కులగణన చేపట్టగా.. తాము సైతం అందుకు సిద్ధంగా ఉన్నామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఒడిశా సర్కారు ఓబీసీ గణన చేపట్టింది. అక్టోబర్ 2న బిహార్ ప్రభుత్వం కులగణన వివరాలను వెల్లడించింది. కులగణన ప్రకారం బిహార్ జనాభా 13 కోట్ల 7 లక్షలకుపైగా ఉండగా.. ఆ రాష్ట్రంలో 63 శాతానికిపైగా ఓబీసీలు, ఈబీసీలే ఉన్నారు. అగ్రకులాలకు చెందిన వారు 15.5 శాతం ఉండగా.. 20 శాతం ఎస్సీలు, 1.6 శాతం ఎస్టీలు ఉన్నారు. బిహార్లో యాదవ సామాజికవర్గం జనాభా (14.26 శాతం) అత్యధికంగా ఉంది.
నితీశ్ సర్కారు ఎలా చేసింది..?
కులగణన కోసం రూ.500 కోట్లు కేటాయించిన బిహార్ ప్రభుత్వం.. 2022 జూన్ 7న ఈ సర్వేను ప్రారంభించింది. ముందుగా రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో జనవరి 7-21 తేదీల మధ్య ఓ సర్వే చేసి.. ఆ తర్వాత ఏప్రిల్ 15 నుంచి బిహార్లోని అన్ని కులాలు, మతాల వారీగా ప్రజల వివరాలు సేకరించింది. కానీ పట్నా హైకోర్టు స్టే విధించడంతో మే 15న ఈ సర్వే నిలిచిపోయింది. ఈ సర్వే చెల్లుతుందని 2022 ఆగస్టు 1న పట్నా హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సర్వే మళ్లీ మొదలైంది. ఆగస్టు 25 నాటికి సర్వే ముగిసిందని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. సర్వే జరిగిన దాదాపు 10 నెలల తర్వాత ఆ వివరాలను ప్రజల ముందు ఉంచింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులగణనకు వ్యతిరేకం. దీంతో ఈ అంశంతో బీజేపీని ఇరుకునపెట్టాలని భావిస్తోన్న కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరోసారి అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇస్తోంది.
కులగణన వల్ల ప్రయోజనం ఏంటి..?
కులగణన వల్ల రాష్ట్రంలో ఏ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎంత మంది నివసిస్తున్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. వారి కోసం ఏయే పథకాలను అమలు చేయాలనే విషయంలోనూ ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. అంతేకాదు ఎన్నికల ప్రచారం సమయంలో ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు తగిన రీతిలో వ్యూహాలను రచించే అవకాశం పార్టీలకు ఉంటుంది.
జగన్ సర్కారుకు కలిగే లబ్ధి ఏంటి..?
ఏపీలో కులగణన జరిగితే.. సామాజికవర్గాలు, మతాల వారీగా రాష్ట్రంలో ఎంత మంది నివసిస్తారనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. బిహార్ ప్రభుత్వం కులగణనకు చాలా సమయం తీసుకోగా.. జగన్ సర్కారు మాత్రం రెండు నెలల్లోనే పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రారంభం కానుంది. అసలే ఏపీలో కులాభిమానం, కులాల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ. మామూలుగానే ఏ నియోజకవర్గంలో ఏ కులం జనాభా ఎక్కువ, ఎవరికి టికెట్ ఇవ్వాలనే చర్చ జరుగుతుంటుంది. ఏపీలోనూ బీసీల జనాభానే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో ఆయా వర్గాలకు చేరువైన జగన్.. ఇప్పుడు తన ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకోవడానికే ఈ కులగణనకు మొగ్గు చూపుతున్నారనే భావన వ్యక్తం అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa