ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తపు మడుగులో విగతజీవిగా,,,ప్రభుత్వ అధికారిణి దారుణ హత్య

national |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 08:21 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రభుత్వ అధికారిణిని ఆమె ఇంట్లోనే హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం ఆఫీస్ ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆమె.. బయటికి రాలేదు. ఇంట్లో ఒంటరిగానే ఉండగా.. ఉదయం వరకు విగత జీవిగా పడి ఉంది. అయితే ఆమె సోదరుడు ఫోన్ చేయగా.. ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి విచారణ ప్రారంభించారు.


ప్రతిమ అనే 37 ఏళ్ల మహిళ బెంగళూరులో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ప్రతిమ బెంగళూరులోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఉన్న దొడ్కకలసంద్రలోని గోకుల అపార్ట్‌మెంట్‌లో ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే రోజూ లాగే ఆఫీస్‌కు వెళ్లిన ప్రతిమ.. శనివారం రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చింది. ప్రతిమను కారులో ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్లిన డ్రైవర్.. ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు.


ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన ప్రతిమ ఇక బయటికి రాలేదు. అయితే అర్ధరాత్రి వేళ.. గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిమ ఇంట్లోకి ప్రవేశించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఉదయం అయినా ఆమె ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఈ క్రమంలోనే ప్రతిమ సోదరుడు ఆమెకు ఫోన్ చేశాడు. అయితే ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. ప్రతిమ ఫోన్ ఎత్తకపోవడంతో అతడు ప్రతిమ ఇంటికి వెళ్లాడు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వెళ్లి ప్రతిమ సోదరుడు చూడగా ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె చనిపోయినట్లు గుర్తించారు.


ప్రతిమ దారుణ హత్యకు గురి కావడంతో ఆమె సోదరుడు విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బెంగళూరు సౌత్ డివిజన్ డీసీపీ రాహుల్ కుమార్ షాపూర్వాడ్.. ప్రతిమను హత్య చేసిన ఇంటికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే సంఘటనా స్థలంలో వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో ప్రతిమకు బాగా తెలిసిన వారే ఈ హత్యను ఎవరినీ అనుమానం రాకుండా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హత్య కోణంలో కుట్రను ఛేదించేందుకు చర్యలు చేపట్టారు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అందులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రతిమ కొన్ని సంవత్సరాలుగా భర్తకు దూరంగా జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నట్లు చెప్పారు. అయితే ప్రతిమ భర్త, కొడుకు.. ఆమెకు దూరంగా తీర్థహళ్లిలో నివసిస్తున్నట్లు వారు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa