ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై తీర్పుపై క్లారిటీ.. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దన్న సుప్రీం కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 06:10 PM

ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కు వాయిదా వేశారు. ఫైబర్ నెట్ కేసులో ఈ నెల 30 వరకు చంద్రబాబుకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అలాగే దీపావళి సెలవుల తర్వాత స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది. ఆరోగ్య కారణాలతో చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని ఆయన తరఫు లాయర్‌లు కోర్టుకు తెలిపారు.


ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గత నెల 12న చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు అక్టోబరు 13, 17, 20వ తేదీల్లో ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసులు నమోదు చేయడాన్ని కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ దీనికంటే ముందే విచారణలో ఉంది.


అయితే ఆ కేసులో తీర్పు వెలువడిన తర్వాత.. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌‌ను విచారణకు స్వీకరిస్తామని చెప్పి గత నెల 20న సుప్రీం వాయిదా వేసింది. సెక్షన్‌17-ఏ కేసులో తీర్పు ఈ నెల 7లోపు వెలువరిస్తామని.. ముందస్తు బెయిల్‌ కేసు విచారణను నవంబరు 9కి వాయిదా వేసింది ధర్మాసనం. 17-ఏ కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేయొద్దని.. ట్రయల్‌ కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. దీనికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ధర్మాసనం గతంలో చెప్పినట్లు 17-ఏ కేసులో ఇప్పటి వరకు తీర్పు వెల్లడించలేదు. ఇవాళ జరిగిన విచారణలో దీపావళి సెలవుల తర్వాత తీర్పును వెల్లడిస్తామని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.. అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు ఈ నెల 28 వరకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటికి ఆపరేషన్ కూడా పూర్తయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa