స్కిల్ డెవల్పమెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈనెల 15న వాదనలు వినిపించాలని సీఐడీకి హైకోర్టు తేల్చిచెప్పింది. బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. స్కిల్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వ్యాజ్యంపై విచారణను 10కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. వ్యక్తిగత కారణాలతో అదనపు అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరుకాలేకపోయారని.. ఈ నెల 21 లేదా 22వ తేదీకి వాయిదా వేయాలని అభ్యర్థించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ తేదీల్లో విచారణ కోసం ఇప్పటికే కొన్ని పిటిషన్లు వాయిదా వేశామని చెప్పారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను 15కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 22కి వాయిదా వేయాలని వివేకానంద మరోసారి కోరగా.. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. బెయిల్ పిటిషన్పై వాయిదాలు కోరుతూ.. చంద్రబాబు వ్యక్తిగత స్వేచ్ఛను సీఐడీ అడ్డుకుంటోందన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. 15వ తేదీన వాదనలు వినిపించాల్సిందేనని సీఐడీకి తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa