ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో దీపోత్సవ్ 2023 ఏడో ఎడిషన్ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ (శనివారం) ప్రారంభించనున్నారు. ఈసారి దీపావళి పండగకు 24 లక్షలకు పైగా దీపాలను వెలిగించాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చూస్తోంది. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే దీపోత్సవాల్లో 25 వేల మంది వాలంటీర్లు దీపాలను వెలిగించనున్నారు. గత ఏడాది దీపావళికి 15.76 లక్షల దీపాలను వెలిగించి యూపీ ప్రభుత్వం రికార్డు నమోదు చేసింది. అయితే ఆ రికార్డును బద్ధలు కొట్టి మరో ఘనత సాధించడానికి యోగి ప్రభుత్వం సిద్దమైంది.
అయోధ్యలోని రామ్ కి పైడిలో ఉన్న 51 ఘాట్లలో 24 లక్షలకు పైగా దీపాలను వెలిగించాలని.. దాని ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లైట్ అండ్ సౌండ్ సిస్టమ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇది వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఉత్తర్ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. అయోధ్య నగరంతోపాటు ఉత్తర ప్రదేశ్ చరిత్రను ప్రదర్శించేందుకు దేశంలోనే అతి పెద్ద భారీ డిజిటల్ స్క్రీన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే వాలంటీర్లకు దీపాలను వెలిగించడం, వాటి నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. 27 కళాశాలలు, అయోధ్యలోని 19 ఇంటర్మీడియట్ కాలేజీలు, రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీల నుంచి ఈ వాలంటీర్లను తీసుకువచ్చారు. రామ్ కి పైడిలోనే దాదాపు 65 వేల దీపాలను వెలిగించనున్నారు. 51 ఘాట్లతో పాటు అయోధ్యలోని ముఖ్యమైన మతపరమైన, చారిత్రక ప్రదేశాల్లో కూడా ఈ దీపాలను వెలిగించేందుకు సిద్ధం చేశారు. అయితే ఈ దీపాలను లెక్కించడానికి 196 దీపాలు చొప్పున 12500 బ్లాక్లలో వెలిగించనున్నారు. మరోవైపు.. దీపావళి రోజున విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగడానికి అధికారులు, ఉద్యోగుల సెలవులను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa