నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో పాల్గొంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్, కార్యదర్శి ఎస్.రాధా చౌహాన్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు లేఖలు రాశారు. రాష్ట్రంలో అధికార పార్టీ వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రస్తావించారు.
ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే జిల్లాలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసుల అధికారులను అధికార పార్టీ కార్యకలాపాలు చేపట్టేలా నిర్దేశిస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు రఘురామ. ప్రభుత్వ సొమ్ముతో వైఎస్సార్సీపీ ప్రచారం కోసం 24 పేజీల రంగుల పుస్తకాన్ని ముద్రించారన్నారు. లక్షల కొద్దీ ముద్రించిన ఆ పుస్తకాల్లో మాజీ సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా అనుచిత కథనాలు ప్రచురించడంతోపాటు గత ప్రభుత్వం కుంభకోణాల్లో మునిగినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.
ప్రజాధనాన్ని ఇలా తన సొంత ప్రచారం కోసం ఉపయోగించుకుంటూ గత ప్రభుత్వాల ప్రతిష్ఠను దెబ్బతీసే దుష్ప్రచారానికి పాల్పడుతున్నా.. ఏఐఎస్ అధికారులెవరూ ప్రశ్నించడం లేదన్నారు. కొన్నిచోట్ల ఈ అధికారులు కూడా అధికార పార్టీ రాజకీయ కార్యకలాపాలను ప్రోత్సహించేలా మీడియాతో మాట్లాడుతున్నారని.. అధికారులు ప్రభుత్వ సమాచారాన్ని వెల్లడించడానికి తప్ప మిగిలిన సందర్భాల్లో మీడియాతో మాట్లాడకూడదన్నారు. తమ ఫిర్యాదులు, అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించకూడదన్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ మేనిఫెస్టో ప్రచారం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతోపాటు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి, ఆయన సలహాదారుడి ఆదేశాల మేరకు సీఎస్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలు, జిల్లాల్లో కీలక పదవుల్లో ఉన్న అధికారులను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ పదవులను ప్రతిభ ఆధారంగా కాకుండా ప్రభుత్వంలోని కొందరి పెద్దల ప్రాపకంతో భర్తీ చేశారని ఆరోపించారు.
ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొందరు ఏపీ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు కొందరు రూల్ బుక్కులోని నిబంధనలన్నీ తుంగలోతొక్కి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. వీటన్నింటిపై తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. సర్వీస్ రూల్స్ను ఉల్లంఘిస్తున్న అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు ఎంపీ రఘురామ. మరి ఈ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. జగన్ సర్కార్ టార్గెట్గా గతంలో కూడా ఎంపీ పలు లేఖలు రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa