ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్పత్రుల లేఖ,,,,బకాయిలు చెల్లించాలని డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 09:48 PM

జగన్ సర్కార్‌కు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల సంఘం ట్విస్ట్ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ బకాయిలను ఈ నెల 27లోపు చెల్లించకపోతే రోగులకు అందించే సేవలు కొనసాగించలేమని తేల్చి చెప్పింది. బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది. వైద్య చికిత్సల ధరలు గణనీయంగా పెరిగినందున చికిత్సల ప్యాకేజీ ధరలు సైతం పెంచాలని కోరారు. ఇప్పటికే సెప్టెంబరులోనే సీఎం జగన్‌కు లేఖ రాశామని.. అయినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.వెయ్యి కోట్లు కాకుండా గడిచిన 45 రోజుల్లో సమర్పించిన బిల్లులు కూడా రావాల్సి ఉందన్నారు. ఈహెచ్‌ఎస్‌ బిల్లులూ బకాయిలున్నాయని, ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.


నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కొన్ని ఆస్పత్రులు 60 నుంచి 90 శాతం ఆరోగ్యశ్రీపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. బిల్లుల పెండింగ్‌తో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని.. ట్రస్ట్‌ బకాయిపడ్డ రూ.1,000 కోట్లు వెంటనే చెల్లించి, సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచలేదని.. వెంటనే వాటిని పెంచాలి అన్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమస్యలు విన్నవించుకునేందుకు వెంటనే జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. బిల్లుల పెండింగ్‌పై గతంలోనూ.. ప్రైవేటు ఆస్పత్రులు తమ సేవలు నిలిపివేస్తామన్నప్పుడు ప్రభుత్వం ఎంతో కొంత ఇచ్చి సర్దిచెప్పింది. ఈ ఏడాది జూన్‌, జూలైలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఇలానే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు హెచ్చరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ సమయంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారులు అనేకసార్లు చర్చలు జరిపారు. ఇకపై బిల్లులు బకాయిలు ఉండవని.. ప్యాకేజీల పెంపుపై కూడా తుది నిర్ణయం తీసుకుంటామని హామీలిచ్చారు. అదే సమయంలో కొంత మొత్తంలో బకాయిలు విడుదల కావడం, ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు మరోసారి ఆస్పత్రుల యాజమాన్యాలు లేఖ రాయడం కలకలంరేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa