దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం వార్షిక వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్ 17 వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణ వెల్లడించారు. రెండు నెలలపాటు కొనసాగే ఈ అయ్యప్ప మహా దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అనేక ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఏటా శీతాకాలంలో నిర్వహించే ఈ అయ్యప్ప దర్శనాలు రెండు నెలల పాటు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మకర సంక్రాంతికి కనిపించే మకర జ్యోతి కోసం దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. దీంతో సాధారణంగానే అత్యంత రద్దీగా ఉండే అయ్యప్ప క్షేత్రం.. మకర జ్యోతి సమయానికి కిక్కిరిసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప సన్నిధానంలో భారీ రద్దీని నియంత్రించేందుకు డైనమిక్ క్యూ కంట్రోల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని మంత్రి కే రాధాకృష్ణ స్పష్టం చేశారు.
నిలాక్కళ్, పంబా, అయ్యప్ప సన్నిధానం ప్రాంతాల్లో వీడియో స్క్రీన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పంబా-సన్నిధానం మార్గంలోనే 15 చోట్ల అత్యవసర ఆరోగ్య కేంద్రాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. శబరిమలలో ఆయా దేవాలయ బోర్డులు కల్పిస్తున్న వసతుల వివరాలను భక్తులకు తెలియజేయాలని ఆయన సూచించారు. శబరిమల వార్షిక వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటివరకు 6 సార్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ఈ 6 సమావేశాల్లో రెండు సార్లు సీఎం పినరయి విజయన్ కూడా పాల్గొన్నారని మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు.
ఇక మండల మకరవిళక్కు పండగ సీజన్లో ఏటా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శిస్తుంటారు. కేవలం అయ్యప్ప మాల వేసుకున్న భక్తులే కాకుండా సామాన్య భక్తులు కూడా అయ్యప్ప దర్శనం కోసం వస్తూ ఉంటారు. మలయాళ నెల వృశ్చికం తొలి రోజున మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం అవుతాయి. జనవరి నెలలో మకర సంక్రాతి రోజున మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa