పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడిందంటోంది వాతావరణశాఖ. విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ.. ఒడిశాలోని పారాదీప్నకు దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ, పశ్చిమ బెంగాల్ దిఘాకు దక్షిణ-నైరుతి దిశలో 410 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ తుఫాన్గా మారితే ‘మిధిలి’గా నామకరణం చేయనున్నారు. ఈ పేరును మాల్దీవులు సూచించింది.
తుఫాన్ ఈ నెల 18న తెల్లవారుజామున బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటొచ్చని చెప్పారు. ఈ ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలకు అవకాశముందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా, యానాంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. రాయలసీమలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో రైతుల కూడా అప్రమత్తం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉందనడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వరిచేలు అక్కడక్కడా నేలకు ఒరుగుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతతో అలర్ట్ అవుతున్నారు.
ముఖ్యంగా వరి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొన్ని జిల్లాల్లో వరిని కోస్తుండగా.. మరికొన్ని చోట్ల కోసిన వరి పంటను కళ్లాల్లో కుప్పలు పెడుతున్నారు. వాటిపై గడ్డి, ప్లాస్టిక్ టార్పన్లు కప్పి జాగ్రత్త చేస్తున్నారు. మరికొందరు హడావిడిగా నూర్పిడి చేపట్టి.. ధాన్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు. కోతలు, నూర్పిడి సమయంలో వర్షం కురిస్తే తమకు తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులతో ప్రస్తుతానికి వరి పంట కోతలు చేయవద్దని.. వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షం పడితే రైతులకు అపారమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పంట కోత కోసిన వేళ.. వర్షం కురుస్తుందోమోనన్న భయం వెంటాడుతోంది. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులతో దిగుబడి తగ్గే అవకాశం ఉందంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa