బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా.. తర్వాత తుఫానుగా మారింది. దీనికి మిథిలి అనే పేరును పెట్టారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరానికి చేరవయ్యింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు బంగ్లాదేశ్లోని ఖెపుపరా తీరానికి చేరుకుంది. తీరం తాకే ప్రక్రియ మొదలైందని, మరో మూడు గంటల్లో ఇది పూర్తవుతుందని ఐఎండీ చెప్పింది. తుఫానుగా తీరం దాటిన మిథిలి.. అనంతరం తీవ్ర వాయుగుండంగా మారనుంది. శనివారం ఉదయానికి మరింత బలహీనపడి వాయుగుండగా మారుతుందని పేర్కొంది.
తుఫాను తీరం దాటుతున్న సమయంలో బంగ్లాదేశ్లోని తీరప్రాంతాల్లో గంటకు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నట్టు తెలిపింది. తుఫాను ప్రభావంతో పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
మిజోరాం, త్రిపురలలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్నింటికి ఎల్లో అలర్జ్ జారీచేసింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లోని గంగా పరివాహక ప్రాంతాల్లోని కొన్నిచోట్ల వచ్చే 24 గంటల్లో ఆకస్మిక వరద ప్రమాదం కూడా ఉందని తెలిపింది. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల తీర ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, గుజరాత్లో, అందులోనూ అహ్మదాబాద్లో ఈ తుఫాన్ ప్రభావం ఉందా? అని క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో రెండు రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరుగనుండటమే అందుక్కారణం. అయితే, గుజరాత్పై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఐఎండీ తెలిపింది. రెండు నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో తుఫాను మిథిలి. మొదటిది సైక్లోన్ హమూన్. ఇది చాలా తీవ్రమైన తుఫానుగా బలపడి అక్టోబరు మధ్యలో బంగ్లాదేశ్లో తీరం దాటింది. మిథిలి కూడా బంగ్లాదేశ్ వద్దే తీరం దాటడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa