ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరఖాండ్ సొరంగ నిర్మాణంలో బిగ్ మిస్టేక్.. ప్లాన్‌చేసిన ఎస్కేప్ రూట్ ఎక్కడ

national |  Suryaa Desk  | Published : Sun, Nov 19, 2023, 09:49 PM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో గత ఆదివారం కుప్పకూలిన సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొలుత వీరిని బయటికి తీసేందుకు ఓ డ్రిల్లింగ్‌ యంత్రంతో రెస్యూ నిర్వహించారు. అది నెమ్మదిగా పనిచేస్తుండటంతో అమెరికాకు చెందిన ఆగర్‌ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ప్రత్యేకంగా వాయుసేన విమానాల్లో తరలించారు. దాంతో డ్రిల్లింగ్‌ పూర్తిచేసి పైపులైను ద్వారా కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావాలని భావించారు. కానీ, ఆ ఆశలూ ఫలించలేదు. శుక్రవారం మధ్యాహ్నం ఐదో పైపును అమరుస్తున్న సమయంలో పెద్దగా పగుళ్లు వచ్చి, భారీ శబ్దం వినిపించింది. దీంతో ఆగర్‌తో డ్రిల్లింగ్ నిలిపివేశారు.


ఇదిలా ఉండగా, సొరంగ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం బయటపడింది. నిర్మాణ సంస్థ తీవ్రమైన లోపాన్ని సూచించే మ్యాప్ బయటకు వచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం.. 3 కి.మీ పొడవున్న అన్ని సొరంగాలు విపత్తు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి తప్పించుకునే మార్గాన్ని కలిగి ఉండాలి. 4.5 కి.మీ సిల్క్‌యారా సొరంగంలోనూ ఈ మార్గం ప్లాన్ చేసినా కానీ అమలు చేయలేదని మ్యాప్ రుజువు చేస్తుంది. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడానికి సహాయ బృందాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి.


సొరంగంలో పగుళ్లు రావడం వల్ల అమెరికా ఆగర్ మెషిన్ కూడా నిలిపివేయడంతో కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్కేప్‌ రూట్‌ నిర్మించి ఉంటే ఇప్పటికైనా కూలీలను రక్షించే అవకాశం ఉండేదని కొందరు కుటుంబ సభ్యులు, ఇతర కార్మికులు తెలిపారు. కుప్పకూలడం, కొండచరియలు విరిగిపడటం లేదా మరేదైనా విపత్తు సంభవించినప్పుడు వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులను రక్షించడానికి సొరంగాలు నిర్మించిన తర్వాత కూడా ఇటువంటి తప్పించుకునే మార్గాలు ఉపయోగించబడతాయి.


సొరంగం కూలిన ప్రదేశాన్ని గురువారం కేంద్ర మంత్రి వీకే సింగ్ సందర్శించి, రెండు మూడు రోజుల్లో కార్మికులను కాపాడతామని తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి శుక్రవారం నాటికి కూడా రెస్క్యూను పూర్తిచేయాలని సూచించారు. అయితే ఊహించని ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఎక్కువ సమయంపై దృష్టిలో ఉంచుకుంటోంది. కూలీలను బయటకు తీసుకురావడానికి ఇప్పటి వరకు మూడు మార్గాలను ప్రయత్నించగా.. మరో మూడు విధాలుగా ప్రయత్నించనున్నారు. ప్లాన్ ఏలో బుల్డోజర్లతో శిథిలాలను తొలగించి లోపలి చిక్కుకున్నవారి వద్దకు చేరుకోవడం కానీ అది సాధ్యం కాలేదు. ప్లాన్ బి ఆగర్ యంత్రంతో డ్రిల్లింగ్ చేసి పైపుల ద్వారా తీసుకురావడం కానీ, అది నెమ్మదిగా పనిచేయడంతో పక్కనబెట్టారు. ప్లాన్ సీ అమెరికాకు చెందిన ఆగర్ మెషిన్‌తో రంధ్రం చేస్తుండగా.. ఐదో పైపును అమరుస్తున్న సమయంలో లోపలి నుంచి భారీ పగుళ్లు వచ్చాయి.


ప్లాన్ డి ఆదివారం అమలు చేస్తారు. కొండ పైభాగం నుంచి కార్మికులు ఉన్న ప్రాంతానికి నేరుగా డ్రిల్లింగ్‌ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) సాయంతో కొండపైకి రోడ్డు మార్గం నిర్మించనుంది. ‘సొరంగంపై భాగంలో డ్రిల్లింగ్‌ చేయాల్సి ప్రాంతాన్ని గుర్తించాం.. తొలుత 4-6 అంగుళాల రంధ్రాన్ని చేస్తాం. దాని ద్వారా ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపుతాం.. పరిస్థితులు అనుకూలిస్తే.. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు వీలుగా మూడు అడుగుల రంధ్రం చేస్తాం’ అని బీఆర్‌వోకు చెందిన అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నంకల్లా కొండపైకి డ్రిల్లింగ్‌ యంత్రాన్ని తీసుకెళ్లే రహదారి నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa