టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై మరోసారి చర్చ జరుగుతోంది. లోకేష్ యువగళం పాదయాత్రను ఈ నెల 24న మళ్లీ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలను బట్టి లోకేష్ పాదయాత్రను విశాఖతో ముగించే అవకావం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈ యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు విశాఖతోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో లోకేష్ కూడా విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నారు. అదే ఖరారైతే ఆయన పాదయాత్ర 10 నుంచి 12 రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఈ ఏడాది జనవరిలో కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత రాయలసీమలో పూర్తి చేసుకుని.. కోస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆగస్టులో నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. దీంతో లోకేష్ రాజమహేంద్రవరం, ఢిల్లీకి పరిమితం అయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించాలని భావించినా వాయిదా వేసుకున్నారు.
అయితే ఇప్పుడు తిరిగి రాజోలు నుంచే యాత్రను ప్రారంభించనున్నారు. రానున్న ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేసే నిమిత్తం ఆయన తన పాదయాత్రను కుదించుకునే యోజనలో ఉన్నారని చెబుతుననారు. అలాగే చంద్రబాబుపై కేసులకు సంబంధించి.. సుప్రీంకోర్టులో మంగళవారం తీర్పు రావొచ్చని భావిస్తున్నారు. ఒక వేళ తీర్పు మరికొద్ది రోజులు ఆలస్యమైనా లోకేష్ పాదయాత్ర 24నే ప్రారంభం అవుతుందని.. ఇందులో మార్పేమీ ఉండదంటున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభమయ్య అంశంపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa