ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

national |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 01:35 PM

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ , తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు చేసింది. రెండు రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.


 


నేడు (బుధవారం), రేపు (గురువారం) కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వాతావరణ విభాగం హెచ్చరికలతో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.


 


మరోవైపు తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు కేరళలో ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa