ఉత్తరాఖండ్లోని సిల్క్యారాలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు గత 11 రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. సోమవారం నుంచి రెస్క్యూలో పురోగతి కనిపిస్తోంది. సోమవారం రాత్రి గొట్టం ద్వారా కార్మికులను మొదటిసారి వండిన ఆహారం అందజేశారు. ఈ నేపథ్యంలో కార్మికులను పైపుల సాయంతో బయటకు తీసుకొచ్చేందుకు డ్రిల్లింగ్ కొనసాగుతోంది. మరో 18 మీటర్లు మాత్రమే మిగులుందని, రాబోయే 24 గంటల్లో పెద్ద వార్త వస్తుందని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్ రవాణా శాఖ సీనియర్ అధికారి మహమూద్ అహ్మద్ మాట్లాడుతూ.. మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటలకు ప్రారంభించిన ఆగర్ (ఎర్త్ డ్రిల్లింగ్ మెషిన్) ఇప్పటివరకు 39 మీటర్లు డ్రిల్లింగ్ చేసిందని చెప్పారు. మరో 18 మీటర్ల మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. ‘ఇప్పటి వరకూ 39 మీటర్లు పూర్తయిందనే విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.. కార్మికులు 57 మీటర్ల లోతున చిక్కుకున్నట్టు సూచిస్తోంది.. కాబట్టి మరో 18 మీటర్లు మిగిలి ఉంది’ అని ఆయన వివరించారు.
‘రెస్క్యూ చాలా సమయం తీసుకునే ప్రక్రియ.. ఇప్పుడు 11వ రోజులో ఉన్నాం.. కార్మికులకు బయటకు తీసుకొచ్చే మార్గాన్ని అందించడానికి డ్రిల్లింగ్ హోల్స్లోకి వెల్డింగ్ పైపులను నెడుతున్నాం.. వెల్డింగ్ చాలా ముఖ్యం... దీనికి సమయం పడుతుంది. డ్రిల్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.. దీని కారణంగా 18 మీటర్ల పైపులను పంపడానికి అర్థరాత్రి నుంచి దాదాపు 15 గంటలు పట్టింది.. అదనంగా 800 ఎంఎం పైపు కూడా సొరంగం లోపల 21 మీటర్లుకు పంపాం.. ఏ అడ్డంకులు లేకపోతే, ఈ రాత్రి లేదా రేపు ఉదయం ఏదైనా పెద్ద వార్త అందవచ్చు. శిథిలాలతో ఇనుప రాడ్ కూడా వచ్చింది. ఇది (రాడ్) ఎటువంటి సమస్యలను సృష్టించలేదని మేం సంతోషిస్తున్నాం’ అని వివరించారు. అయితే, మిగిలి ఉన్న భాగమే చాలా క్లిష్టమైందని ఆయన అన్నారు.
రెస్క్యూ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతున్నాయి. శిథిలాలు ఊడిపడటం, భారీ డ్రిల్లింగ్ యంత్రాలు పదేపదే విచ్ఛిన్నం కావడం వల్ల సంక్లిష్టంగా ఉన్నాయి. గత వారం ఒక యంత్రం బండరాళ్లలోకి దూసుకెళ్లింది. దీనివల్ల సొరంగం పైకప్పు పగుళ్లు కనిపించడంతో మూడు రోజులకు పైగా డ్రిల్లింగ్ నిలిపివేశారు. ఇక, లోపలి చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను మరో 60 గంటల నుంచి 15 రోజుల్లోగా బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa