శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు విష సర్పాలు భయపెడుతున్నాయి. స్వామి దర్శనానికి వస్తున్న తిరువనంతపురం జిల్లాకు చెందిన నిరంజన ఆరేళ్ల చిన్నారి బుధవారం పాము కాటుకు గురయ్యింది. ఈ ఘటనతో కేరళ ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. నడకదారిలో విషపూరిత సర్పాలను పట్టుకునేందుకు మరింత మంది పాములను పట్టుకునేవారిని మోహరించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సన్నిధానం పరిసరాల్లో యాత్రికుల రక్షణకు పాములు పట్టేవారి నియామకంపై కేరళ దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు.
అంతకు ముందు ఈ అంశంపై ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు, అటవీ మంత్రిత్వశాఖల మధ్య చర్చ జరిగింది. కాగా, పాముకాటుకు గురైన చిన్నారి నిరంజన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. తిరువనంతపురం జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి తన కుమార్తె నిరంజనతో కలిసి శబరిమలకు వస్తుండగా.. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మార్గమధ్యంలో పాపను పాము కాటువేసింది. దీంతో వెంటనే పంబ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. యాంటీ-వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తదుపరి చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.
ఆలయానికి వెళ్లే దారిలో వన్యప్రాణుల దాడులు జరగకుండా అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆ శాఖలో ఇద్దరు పాములు పట్టేవారు పనిచేస్తున్నారు. అయితే ఘటన తీవ్రత దృష్ట్యా మరో ఇద్దరు పాములు పట్టేవారిని నియమించాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆదేశించారు. వర్షాలు, వాతావరణంలో మార్పుల సమయంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది. శబరిమల ఆలయ పరిసరాల్లో యాత్రికులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa