ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్కు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంతా సజావుగా సాగుతోందుకున్న తరుణంలో ఏదో ఒక ఆటంకం కలుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే గురువారం రాత్రికే సొరంగం నుంచి కూలీలు బయటకు వచ్చేస్తారని అధికార యంత్రాంగం పూర్తి విశ్వాసంతో ఉన్న తరుణంలో మరో అడ్డు తగిలింది. గుర్తుతెలియని ఇనుప పట్టీ వంటిది అడ్డు తగలడంతో డ్రిల్లింగ్ నిలిచిపోయింది. గ్యాస్కట్టర్తో తొలగించాక మళ్లీ డ్రిల్లింగ్ పనులు మొదలయ్యాయి.
సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు 90 శాతం పూర్తయ్యాయి. కానీ, చివరిలో 8 నుంచి 10 నుంచి 12 మీటర్ల డ్రిల్లింగ్ మిగిలి ఉన్న తరుణంలో రెస్క్యూ నెమ్మదించింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఈ పైపుల ద్వారా ఆ అడ్డంకి వరకు చేరుకుని, యంత్రాలతో దానిని తొలగించాయి. దీంతో మళ్లీ పనులు మొదలయ్యాయి. పనులు పునః ప్రారంభించాక కూడా గురువారం రాత్రి మరోచిన్న అవాంతరం ఎదురైంది.
25 టన్నుల భారీ డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉంచిన వేదికకు పగుళ్లు ఏర్పడటంతో పనులు నిలిపివేశారు. అధికారులు దీనిని ధ్రువీకరించడం లేదు. శుక్రవారం లేదా శనివారం అందరినీ బయటకు తీసుకురావచ్చని అంచనాలు చెబుతున్నాయి. పైపులను ప్రవేశపెట్టే పని పూర్తయ్యేందుకు మరో 12-14 గంటల సమయం పడుతుందని పీఎంవో మాజీ సలహాదారుడు ఖుల్బే చెప్పారు. 45 మీటర్ల వద్ద ఆగిన పని మరో 1.8 మీటర్ల మేర ముందుకు వెళ్లిందని ఉత్తరాఖండ్ నోడల్ అధికారి నీల్ నీరజ్ ఖైర్వాల్ తెలిపారు.
కాగా, దీపావళి రోజున సొరంగం కూలిన సమయంలో ఒక మెటల్ ఫ్రేమ్ కూడా కూలిపోయి శిథిలాల కింద కూరుకుపోవడం డ్రిల్లింగ్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వర్గాలు తెలిపాయి. అందుకే ఆటంకాలు ఏర్పడతున్నాయని, ఇలాంటివి మరో 3-4 కూడా తగలవచ్చని అంటున్నారు. ఒకవేళ, ఈ ప్రయత్నం ఫలించకపోతే కొండ మీది నుంచి కిందికి తవ్వకం చేపట్టేందుకు ఏర్పాట్లూ కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa