ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో మరో భారతీయ విద్యార్ధిని కాల్చిచంపిన దుండగులు.. ఆలస్యంగా వెలుగులోకి

national |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 11:42 PM

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. 26 ఏళ్ల విద్యార్థి ఆదిత్య అద్లాఖాను కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ నెల మొదట్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన భారతీయ విద్యార్ధి యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ మెడికల్ స్కూల్‌‌లో మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌ నాలుగో ఏడాది చదువుతున్నట్టు అధికారులు తెలిపారు. సిన్సినాటీ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఆదిత్య మృతిచెందినట్టు హమిల్టన్ కౌంటీ కోరోనర్ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది.


సిన్సినాటి పోలీస్ లెఫ్టినెంట్ జోనాథన్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ.. నవంబర్ 9న వెస్ట్రన్ హిల్స్ వయాడక్ట్ ఎగువ డెక్‌లో గోడను ఢీకొట్టిన వాహనం లోపల కాల్పులకు గురైన ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారని తెలిపారు. ఈ ఘటన ఉదయం 6.20 గంటల ప్రాంతంలో జరిగినట్లు పేర్కొన్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు 911కి కాల్ చేసి, బుల్లెట్ రంధ్రాలున్న కారులో ఓ వ్యక్తి గాయాలతో ఉన్నట్టు సమాచారం ఇచ్చారని చెప్పారు.


గాయాలతో ఉన్న ఆదిత్య అద్లాఖాను సిన్సినాటీ మెడికల్ సెంటర్‌కు తరలించారని, అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు రోజుల తరువాత చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. తమ విద్యార్ధి మరణంపై యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ఆకస్మిక, విషాదకరమైన ఘటన అని పేర్కొంది. ‘ఆదిత్యను అందరూ చాలా ఇష్టపడేవారు.. చాలా తెలివైన, చురుకైన విద్యార్ధి.. పెద్దపేగులో అల్సర్లు, నొప్పికి న్యూరోఇమ్యూన్ కమ్యూనికేషన్ పరస్పర చర్యలు ఎలా దోహదపడతాయో అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నాడు’ సిన్సినాటి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.


ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఆదిత్య అద్లాఖా పరిశోధనల కోసం అమెరికా వెళ్లాడు. ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌జాస్ కాలేజీ నుంచి 2018లో జంతుశాస్త్రంలో డిగ్రీ, 2020లో ఎయిమ్స్‌ నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. అదే ఏడాది మాలిక్యూలర్ బయాలజీలో పరిశోధనల కోసం సిన్సినాటీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. ఆదిత్య కారుపై దుండుగులు పలుసార్లు కాల్పులు జరిపారు. డ్రైవర్ సీటు పక్కన విండో వద్ద కనీసం మూడు బుల్లెట్ రంధ్రాలను పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa