ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహువా మెయిత్రా వ్యవహారంపై మౌనం వీడిన మమతా బెనర్జీ.. కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 11:48 PM

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారంపై బెంగాల్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు. లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయితే.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె విజయావకాశాలను మరింత పెంచుతుందని దీదీ వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ నుంచి మహువా మోయిత్రా బహిష్కరణకు ప్లాన్ చేస్తున్నారు... అయితే, ఇది ఎన్నికల ముందు ఆమెకు సహాయం చేస్తుంది’ అని అన్నారు.


మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ నుంచి రూ. 2 కోట్ల నగదుతో సహా లంచం తీసుకున్నారని మెయిత్రా ఎదుర్కొంటున్న ఆరోపణలపై చర్చించడానికి బెంగాల్ సీఎం నిరాకరించారు. కాగా, మొయిత్రాను తృణమూల్ కాంగ్రెస్ దూరం పెట్టిందని, మమతా బెనర్జీ మౌనం తన పార్టీ ఎంపీ నేరాన్ని అంగీకరించినట్టేనని బీజేపీ చేస్తున్న ఆరోపణలకు తాజా వ్యాఖ్యలతో చెక్ పెట్టినట్టయ్యింది.


ఇదిలా ఉండగా.. వివాదంలో చిక్కుకున్న మెయిత్రాకు తృణమూల్ కాంగ్రెస్ మరో కొత్త బాధ్యతలు కట్టబెట్టింది. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కృష్ణానగర్ జిల్లాకు టీఎంసీ అధ్యక్షురాలిగా నియమించడం గమనార్హం. తనను జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకు మమతా బెనర్జీకి మహువా మెయిత్రా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కృష్ణానగర్ జిల్లా ప్రజల కోసం తాను ఎల్లప్పుడూ పార్టీ తరఫున పనిచేస్తానని ట్వీట్ చేశారు.


కాగా, మెయిత్రా వ్యవహారంపై కేవలం టీఎంసీ సీనియర్ నేత, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఒక్కరే స్పందించారు. ఆమెను బలపశువును చేస్తున్నారని ఆరో వ్యాఖ్యానించారు. అంతకు ముందు, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఈ నెలలో ముగిసిన విచారణ తర్వాత పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వివాదంపై మెయిత్రా స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నప్పుడు నైతిక విలువల కమిటీ అసంబద్ధమైన ప్రశ్నలు సంధించిందని ఆయన ఆరోపించారు.


ఇక,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా‌కు నివేదికను అందజేసిన కమిటీ.. మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి నేరపూరితమైనవి" అని పేర్కొంది. అయితే, కమిటీలోని విపక్ష ఎంపీలు మాత్రం.. విచారణ సక్రమంగా జరగలేదని, ఏకపక్షంగా నివేదికను తయారు చేశారని ఆరోపించారు. దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగటమే కాదు.. తన పార్లమెంట్ లాగిన్ వివరాలను కూడా ఇతరులతో పంచుకున్నట్లు వెల్లడైంది. మహువా భారత్‌లో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు గుర్తించారు. లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను ఇతరులకు ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa