రైల్వే ఈ-టిక్కెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ లో గురువారం మధ్యాహ్నం సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా వెబ్సైట్, యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోవడంతో లక్షలాది మంది తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఐఆర్సీటీసీ.. సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించిందని తెలిపింది. ప్రస్తుతం వెబ్సైట్ యధావిధిగా పనిచేస్తోందని, టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ మేరకు ట్వీట్ చేసింది.
‘సాంకేతిక కారణాలతో ఈ-టికెట్ బుకింగ్ తాత్కాలికంగా ప్రభావితమైంది.. సాంకేతిక బృందం ప్రయత్నించి సమస్యను పరిష్కరించింది.. తిరిగి మధ్యాహ్నం 1.55 గంటలకు వెబ్సైట్ను పునరుద్దరించింది.. ’అని ట్విట్టర్లో పేర్కొంది. మరోవైపు, వెబ్సైట్ డౌన్ కావడంతో పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐఆర్సీటీసీ వెబ్సైట్ రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల వరకు పనిచేయలేదు.. రోజువారీ నిర్వహణ తర్వాత వెబ్సైట్ మూసివేయటం ఆందోళన కలిగించే విషయం.. అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారు’ అని ఓ వ్యక్తి మండిపడ్డారు.
మరో వ్యక్తి వెబ్సైట్ డౌన్లో ఉన్న వీడియోను షేర్ చేసి.. ‘ఈ సేవలు ఏంటి? ప్రీమియం తత్కాల్ కోసం భారీ డబ్బు తీసుకోవడం కానీ నిర్వహణ చాలా దారుణంగా ఉంది’ అని రైల్వేను ప్రశ్నించాడు. ఆన్లైన్ రైల్వే టిక్కెట్లు, రైల్వే క్యాటరింగ్ సేవలకు భారత ప్రభుత్వంతో అధికారిక గుర్తింపు పొందిన ఏకైక సంస్థ ఐఆర్సీటీసీ. రైలు పర్యటనలు, హోటల్ బుకింగ్లు, హాలిడే ప్యాకేజీల వంటి విస్తృత శ్రేణి పర్యాటక, ఆతిథ్య సేవలను అనేక ఏళ్లుగా అందజేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa