ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ప్రతిపక్ష కూటమి ఇండియా తదుపరి సమావేశం నిర్వహణకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. డిసెంబరు 6న దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది. కూటమికి నాయకత్వం వహిస్తోన్న కాంగ్రెస్.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగో సమావేశాన్ని వాయిదా వేసింది. చివరిసారిగా ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైంది. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ర్టాల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ఇండియా కూటమి బలోపేతంపై లేదని గత నెలలో బీహార్ సీఎం నితీశ్కుమార్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ పాలనపై పోరాడటానికి తామంతా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డామని, కానీ మొదట ఉన్న ఉత్సాహం తర్వాత లేకుండా పోయిందని అన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన విమర్శించారు. కూటమి బలోపేతాన్ని వదిలేసిన కాంగ్రెస్ ఐదు రాష్ర్టాల ఎన్నికల కోసమే పాకులాడుతుందని నితీశ్ దుయ్యబట్టారు.
ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని అన్నారు. ఆ కూటమి నేతలు కేవలం ఒక్కచోట సమావేశమై చర్చలు జరిపి, టీ తాగేసి, మీడియాతో మాట్లాడినంత మాత్రాన దేశమంతటా ప్రజల్లో చైతన్యం రాదని ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లో ఇండియా కూటమి చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. యూపీఏ పేరును ఇండియాగా మార్చడం తప్ప వారు ఏమీ చేయలేదని అన్నారు. తమ ఉమ్మడి నేత ఎవరో చెప్పలేకపోయారని, తమ విధానాలు ప్రకటించలేకపోయారని ధ్వజమెత్తారు. కనీసం కూటమి ఆధ్వర్యంలో ఒక్క ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించలేకపోయారని పీకే విరుచుకుపడ్డారు. బీహార్ సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ నేతలు లాలూ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు తమ సొంత రాష్ట్రంలో ప్రభావం చూపగలరేమో కానీ దేశవ్యాప్తంగా చూపగల బలం వారికి లేదని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూకు ఐదు సీట్లు కూడా రావని, ఆ పార్టీ ఆర్జేడీలో విలీనం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa