సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి కేటీఆర్ను, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ పక్కన కూర్చుని మాట్లాడిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ గారికి తుంటి ఆపరేషన్ జరిగిందని తెలిసి ఆయనతో మాట్లాడాలని వచ్చినట్లు.. చెప్పారు. కేసీఆర్ మామూలుగా నడవాలంటే ఆరువారాలు పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు వివరించారు. జీవితంలో చిన్నచిన్న ఇబ్బందులు సహజమన్న టీడీపీ అధినేత.. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజల కోసం అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు. త్వరలోనే కేసీఆర్ మామూలుగా నడుస్తారని చెప్పారు.
మరోవైపు ఆస్పత్రిలో కోలుకుంటున్న కేసీఆర్ను చంద్రబాబుతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, సినీనటుడు ప్రకాష్రాజ్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పరామర్శించారు. కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్లో కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముకకు గాయం కాగా.. యశోద ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. కేసీఆర్ ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తుండగా.. త్వరలోనే కేసీఆర్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి 8 వారాల సమయం పడుతుందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa