విశాఖపట్నంలోని టైకూన్ జంక్షన్ వ్యవహారం రాజకీయంగా ముదురుతోంది. టైకూన్ కూడలి మూసివేత అంశంపై జనసేన పోరాటం ఉద్ధృతం చేస్తోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిల్డింగ్కు వాస్తు దోషం ఉంటే రోడ్డును మూసేస్తారా అంటూ ప్రశ్నిస్తున్న జనసేన నేతలు సోమవారం.. నిరసన చేపట్టారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దీనికి మద్దతు ప్రకటించారు. వాస్తుదోషం ఉందనే కారణంతో టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గాన్ని మూసివేశారంటూ వైజాగ్ నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మనోహర్ ఆందోళనకు దిగారు.
రోడ్డును మూసివేయడం వలన ప్రయాణికులు రెండు కిలోమీటర్లు దూరం ఎక్కువ ప్రయాణించాల్సి వస్తోందన్న నాదెండ్ల మనోహర్.. వాస్తుదోషం ఉందని మూసేయడం అన్యాయమని ఆరోపించారు. వెంటనే రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు నాదెండ్ల మనోహర్ అరెస్ట్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు నాదెండ్ల మనోహర్ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషం ఉందని రోడ్డు మూసివేయడం దారుణమన్న పవన్ కళ్యాణ్.. ఈ విషయమై జనసేన ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు, వీరమహిళల పట్ల పోలీసుల తీరును పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల మనోహర్తో పాటు అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వం ఇదే ధోరణిలో వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని.. ప్రజల తరఫున పోరాడతానని ప్రకటనలో హెచ్చరించారు. టైకూన్ కూడలి మూసివేత అంశం మీద జనసేన పార్టీ గత కొంతకాలంగా పోరాడుతోంది. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విశాఖలో జరిగిన సమయంలో స్థానికులు కొందరు ఈ అంశాన్ని జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలంటూ పవన్ కళ్యాణ్ సైతం అధికారులను కోరారు. అయితే ఆ తర్వాత నుంచి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో.. జనసేన మరోసారి ప్రత్యక్షపోరాటానికి సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa