ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పం ప్రజలారా బీ అలెర్ట్.. తరలి వస్తున్న ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 09:52 PM

చిత్తూరు జిల్లా కుప్పానికి ప్రమాదం ముంచుకు వస్తోంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగులతో కూడిన గుంపు తరలివస్తోంది. ఆదివారం రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో ఈ ఏనుగుల గుంపు హల్‍‌చల్ చేసింది. దీంతో కుప్పం సరిహద్దు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గ్రామ సరిహద్దుల్లో, పొలాల్లో రాత్రిపూట ప్రజలు ఉండొద్దని హెచ్చరికలు జారీచేశారు. ఏనుగుల దండు కుప్పం వైపు వస్తే పంట పొలాలు తొక్కేసి నాశనం చేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. దీంతో అప్రమత్తమైన.. అటవీ శాఖ అధికారులు ఎలిఫెంట్ ట్రాకర్స్‌ను రంగంలోకి దింపారు. ఏనుగులు కుప్పం వైపు రాకుండా గస్తీ కాస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతాంగాన్ని ఏనుగులు హడలెత్తిస్తున్నాయి. పొలాలు.. తోటల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేసేస్తున్నాయి. ఒక్కోసారి ఊళ్లమీద పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల బారినుంచి తమను కాపాడాలని ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం వి.కోట మండలంలోని కృష్ణాపురం, మోట్లపల్లి, జవునిపల్లి, మిట్టూరు గ్రామాల్లోకి 13 ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలు నాశనం చేశాయి. ఇప్పుడు తమిళనాడు నుంచి ఏకంగా 70 ఏనుగుల గుంపు వస్తుండటంతో తమ బతుకులు ఏమవుతాయోనని చిత్తూరు వాసులు ఆందోళనకు గురవుతున్నారు. వాటిని మరోప్రాంతం వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa