టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అందుకుంది. యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. 219వ రోజు ఆదివారం 16.3 కి.మీ నడిచారు.. సోమవారం పాదయాత్ర ప్రారంభించి.. తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు దగ్గర 3వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న పైలాన్ను ఇవాళ ఆవిష్కరించారు.
'వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3000 కి.మీ. మైలురాయికి చేరింది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారుమూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర.. పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు, టీడీపీ కార్యర్తల నుంచి భారీ స్పందనవ చ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం దిండి వద్ద సెప్టెంబరు 8న యాత్ర ప్రవేశించింది. మర్నాడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు లోకేష్.
లోకేష్ యువగళం పాదయాత్ర 3,000 కిలోమీటర్లు దాటిన సందర్భంగా.. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డులో 3 వేల ఆటోలతో మోహనకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. ‘వచ్చేది బాబే.. ఇచ్చేది బాబే’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గతంలో యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా రెండొందల ట్రాక్టర్లతో గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో వైెఎస్ జగన్, షర్మిల మాత్రమే మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన రికార్డు ఉంది.. ఇప్పుడు లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు 2012లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అయితే లోకేష్ పాదయాత్రను ఈ నెల 17న ముగించనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా వరకు పాదయాత్ర చేయాలనుకున్నా.. ముందే ముగిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో పాటుగా మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంపైనా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. అందుకే పాదయాత్రను ముందుగానే ముగించారని చెబుతున్నారు. ఆ తర్వాత జిల్లాల్లో పర్యటనలు ఉంటాయంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa