జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్మూ కశ్మీర్ పునర్వవస్థీకరణ (సవరణ) బిల్లు 2023పై రాజ్యసభలో చర్చల్ో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టికల్ 370 రద్దు, పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్లో అంతర్భాగమని, మన నుంచి ఎవరూ దానిని లాక్కోలేరని పునరుద్ఘాటించారు. ‘నెహ్రూ విధానాన్ని సమర్థించే, అనుసరించే వ్యక్తులను నేను అడగాలనుకుంటున్నాను.. ఆర్టికల్ 370 అంత అవసరమే అయితే నెహ్రూ 'తాత్కాలికం' అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు?’ అని ఆయన ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 శాశ్వతమని ఎవరైనా అంటే అది రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే అని షా అన్నారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా విషయంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘మేము రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్దరిస్తామని, తగిన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని నేను చెప్పాను.. గవర్నర్ పాలన లేదా రాష్ట్రపతి పాలన రాజ్యాంగ ప్రక్రియకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా తప్పుడు ప్రక్రియ ద్వారా ఆర్టికల్ 370ని తొలగించారని కాంగ్రెస్ చెబుతోంది.. తప్పుచేసిన వారు (కాంగ్రెస్) సరి చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది.. లేకుంటే వారు మిగిలి ఉన్న సీట్లు కోల్పోతారు’ అని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
‘ఆర్టికల్ 370 కారణంగా జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదం పెరిగి తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది.. పునర్విభజన కమిషన్ జమ్మూ కశ్మీర్లో సీట్లను 83 నుంచి 90కి పెంచాలని సిఫార్సు చేసింది.. జమ్మూలో 37 ఉండగా 43కి.. కశ్మీర్లో 46 నుంచి 57కి పెంచాలని సూచించింది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్దేనని మరోసారి చెప్పాలనుకుంటున్నాను.. దానిని మన నుంచి ఎవరూ తీసుకోలేరు..నిర్వాసిత కశ్మీరీ ప్రజలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. గుజ్జర్ కమ్యూనిటీకి అందుతున్న ప్రయోజనాలలో ఎలాంటి మార్పులు ఉండవు.. ఉద్యోగం పోతుంది, చదువులో సీటు పోతుంది అనే భయం అక్కర్లేదు.. చాలా రాష్ట్రాలు భారత్లో విలీనమయ్యాయి.. వాటికి ఆర్టికల్ 370 ఎందుకు లేదు..’ అని అన్నారు.
ఇదే సమయంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి అమిత్ షా దాడి చేశారు. ‘ఒక వ్యక్తికి ఈ పని ఇవ్వడం వల్ల భారతదేశంలో జమ్మూ కశ్మీర్ చేరిక ఆలస్యమైంది... కశ్మీర్లో అకాల కాల్పుల విరమణ లేకపోతే పీఓకే సమస్య ఇప్పుడు ఉండేంది కాదు.. వారు (ప్రతిపక్షం) 80ల నుంచి 40 ఏళ్లుగా తప్పులు చేస్తూనే ఉన్నారు.. నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం దాన్ని సరిదిద్దాలని భావిస్తుంది.... దేశంలోని అంగుళం భూమిని కూడా వదులుకోం.. ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు.. జమ్మూ కశ్మీర్లోని మూడు పరివారాలు భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఎస్టీల హక్కులను అడ్డుకున్నాయి.’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa