పశువుల కోసం గడ్డికోయడానికి పొలంలోకి వెళ్లిన ఓ రైతుపై పులి పంజా విసిరింది. అతడిపై దాడిచేసి చంపేసిన ఆ పులి.. మృతదేహంలో కొంత భాగాన్ని పీక్కుతుంది. అత్యంత భయానకమైన ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడి జనం బెంబేలెత్తిపోయారు. పులి అలజడి సృష్టించడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిని చంపేయాలంటూ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. అయితే, తొలుత అది మ్యాన్ ఈటర్ అవునా? కాదా? నిర్దారించుకోవాలని విజయన్ ప్రభుత్వం సూచించింది.
వయనాడ్కు చెందిన 36 ఏళ్ల ప్రజీశ్ అనే రైతు.. పశువుల కోసం గడ్డి కోయడానికి పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో ఓ పులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం చనిపోయిన ప్రజీశ్ శరీరంలో కొంతభాగాన్ని తినేసింది. ఆ ఘటనతో స్థానికంగా తీవ్ర అలజడి రేగింది. ఆందోళనకు దిగిన స్థానికులు.. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని పోలీసులు తరలించకుండా అడ్డుకున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలని, పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉత్తర్వులు వెలువరించిన అటవీ శాఖ.. వీలైతే దానిని ప్రాణాలతో పట్టుకోవాలని, లేకుంటే చంపేయాలని పేర్కొంది.
ఈ ఆదేశాల అమలుకు ముందు అది మ్యాన్ ఈటర్ అవునా..? కాదా..? ధ్రువీకరించుకోవాలని సూచించింది. ‘ఆ పులి మ్యాన్ ఈటర్ అని తేలిన తర్వాత దానిని అదుపులోకి తీసుకోలేకపోతే.. దానిని చంపివేయాలి’ అని స్పష్టం చేసింది. దీంతో అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. దాని జాడ గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దానికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ జనవరిలో కూడా వయనాడ్లో ఇదే తరహా ఘటనే చోటుచేసుకుంది. పులి దాడిలో 52 ఏళ్ల రైతు ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa