ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివరాజ్ సింగ్ చౌహన్‌కు షాక్.. మధ్యప్రదేశ్ సీఎంగా ప్రముఖ వ్యాపారవేత్త

national |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 10:15 PM

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త వ్యక్తులకే ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మాజీ కేంద్ర మంత్రి విష్ణుదేవ్ సాయిని నియమించింది. తాజాగా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొత్త వ్యక్తినే బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. దీంతో ఎంపీ సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరదించింది. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ పేరును మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. డిప్యూటీ సీఎంలుగా జగదీశ్ దేవ్ డా, రాజేశ్ శుక్లాలు వ్యవహరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించింది.


నాలుగుసార్లు సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహన్‌ను బీజేపీ పక్కనబెట్టడం గమనార్హం. 58 ఏళ్ల మోహన్ యాదవ్ ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జయిని (దక్షిణ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ రాష్ట్ర జనాభాలో సగం మంది ఓబీసీలే కానీ, అంతగా ప్రభావం చూపని యాదవ సామాజిక వర్గం వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం చెప్పుకోదగ్గ అంశం. అయితే, ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన మోహన్ యాదవ్ 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కమలనాథ్ సర్కారు కూలిపోయిన తర్వాత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్‌లో ఉన్నత విద్యాశాఖ మంత్రి పదవిని కూడా చేపట్టారు.


తనను సీఎంగా ఎంపిక చేసిన బీజేపీకి మోహన్ యాదవ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘నేను పార్టీలో చాలా చిన్న కార్యకర్తను తమ అభిమానం, మద్దతుతో అవకాశం ఇచ్చిన రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి కృత‌జ్ఞ‌తలు.. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు ’ అని అన్నారు. కాగా, మోహన్ యాదవ్‌ను మాజీ సీఎం చౌహన్ ప్రతిపాదించగా... ప్రహ్లాద్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, కైలాస్ విజయ్‌వర్గీయ‌లు మద్దతు తెలిపారు. డిప్యూటీ సీఎంలుగా నియమితులైన జగదీశ్ దావ్‌డా, రాజేశ్ శుక్లాలు గతంలో చౌహన్ క్యాబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. స్పీకర్‌గా మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌‌ను ఎంపిక చేశారు. అయితే, తోమర్‌తో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ పటేల్‌ పేర్లు సీఎం ఆశావాహుల జాబితాలో ప్రధానంగా వినిపించాయి. అయితే, వీరందర్నీ పక్కనబెట్టి మోహన్ యాదవ్‌ పేరును బీజేపీ అనూహ్యంగా ప్రకటించింది. అక్కడే ఉన్న మాజీ సీఎం చౌహన్.. కొత్త సీఎం యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa