ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌ వద్ద సొరంగం కలకలం.. బయటపడ్డ 4 అడుగుల గుంత

national |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 10:17 PM

దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హిండన్‌ వైమానిక స్థావరం వద్ద భద్రతా వైఫల్యం కలకలం రేగుతోంది. ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌లోని ఉన్న హిండన్ ఎయిర్‌ బేస్ కింద సొరంగాన్ని తవ్వేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌బేస్ ప్రహరీ గోడ వద్ద ఓ నాలుగు అడుగుల మేర తవ్విన గుంత బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీకి దాదాపు 10 కి.మీల దూరంలో ఉన్న ఈ ఎయిర్‌ బేస్‌ చుట్టూ అనేక నివాస సముదాయాలున్నాయి. ఆదివారం ఉదయం ఎయిర్‌ బేస్‌కు చెందిన ఓ ప్రహరీ గోడ వద్ద గొయ్యి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.


దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వైమానిక దళ అధికారులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఆ గొయ్యిని చూస్తే ఎయిర్‌బేస్‌ లోపలికి సొరంగం తవ్వేందుకు నిందితులు యత్నించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దాదాపు 20 అడుగుల ఎత్తున్న ప్రహరీ గోడను కింది భాగంలో బద్దలుగొట్టి సొరంగం తవ్వేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నాలుగు అడుగుల లోతు వరకు దీన్ని తవ్వినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. గుంతను ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది మట్టితో పూడ్చేశారు. భారత వైమానిక దళ వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌‌కు చెందిన హిండన్ ఎయిర్ బేస్.. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక స్థావరాల్లో ఒకటి. రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల గగనతల భద్రతలో ఇది కీలకంగా పనిచేస్తుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో ఇక్కడ మిగ్‌-29 యుద్ధ విమానాలను మోహరించారు.


హిండన్ బేస్‌కు సమీపంలో నివసించే అనిల్ కుమార్ అనే ఓ స్థానికుడు మాట్లాడుతూ.. ‘గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చాలా దొంగతనాలు జరిగిన ఘటనలు ఉన్నాయి.. డిసెంబరు 7న తమ బంధువుల ఇంటిలో వివాహానికి ముజఫర్‌నగర్‌కు వెళ్లినప్పుడు ఇంట్లో దొంగలుపడ్డారు.. దీంతో ఈ అంశంపై స్థానికులమంతా సమావేశమై చర్చించాం.. ఈ క్రమంలో గోపాల్ అనే వ్యక్తి ఎయిర్ బేస్ గోడ పక్క గుంతను గుర్తించాడు.. వెంటనే మాకు వచ్చి చెప్పడంతో నేను, నా సోదరుడు, మరికొందరం అక్కడి వెళ్లాం.. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాం’ అని అన్నారు. అలాగే, డ్రగ్స్, మద్యం బానిసలైన యువత, సంఘవ్యతిరేక శక్తులు దొంగతనాలు, దోపీడీలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa