దక్షిణాదిలోని కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊపుతో వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలపై హస్తం పార్టీ గురిపెట్టింది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ప్రముఖ నటుడు శివ రాజ్కుమార్కు పబ్లిక్గా ఓ ఆఫర్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని కన్నడ సూపర్ స్టార్ను కోరారు.
ఆదివారం బెంగళూరులో జరిగిన ఆర్య ఈడిగ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. ఈ సామాజిక వర్గానికి చెందిన శివ రాజ్కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ.. ‘‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని శివ రాజ్కుమార్ను కోరా.. కానీ, ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్లు పూర్తిచేయాల్సి ఉందని చెప్పారు.. ఆయనకు నేను చెప్పేది ఒకటే.. సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ, పార్లమెంట్కు వెళ్లే గొప్ప అవకాశం అందరికీ రాదు. మీ తలుపుతట్టిన అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. మా ఆఫర్ను ఒకసారి పరిశీలించండి’ అని కోరారు.
అయితే, డీకే ఆఫర్కు అప్పుడు స్పందించని శివ రాజ్కుమార్.. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్ను ఆయన చాలా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ‘మేకప్ వేసుకుని నటించి ప్రేక్షకులను మెప్పించడం అనేది నా తండ్రి నాకిచ్చిన బహుమతి.. ప్రత్యక్ష రాజకీయాలకు మా కుటుంబం దూరంగా ఉంటుంది.. రాజకీయాలతో నాకున్న ఏకైక సంబంధం.. నేను గీత (మాజీ సీఎం బంగారప్ప కుమార్తె)ను పెళ్లి చేసుకోవడమే. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉంది.. ఓ భర్తగా ఆమె ఆశయాలను నేను ప్రోత్సహిస్తాను. ఆమెకు మీరు టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి’ అని డీకే శివకుమార్తో శివరాజ్కుమార్ చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
గీత ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం యడియూరప్పపై జేడీఎస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు గీత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె సోదరుడు మధు బంగారప్ప తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ప్రస్తుతం సిద్ధరామయ్య క్యాబినెట్లో విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక, వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 20 స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa