పాకిస్థాన్లో మరోసారి సైనికులే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. అఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోని పాక్ సైనిక స్థావరంపై మంగళవారం తెల్లవారుజామున ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కనీసం 23 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఉన్న సైనిక స్థావరంపై దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆత్మాహుతతి దాడికి బాధ్యతవహిస్తూ పాకిస్థానీ తాలిబన్లు ప్రకటన చేశారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయానికి సైనికులంతా గాఢనిద్రలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. సాధారణ దుస్తుల్లో ఉండటం వల్ల వీరంతా సైనికులేనా అనేది ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నామని చెప్పారు.
ఈ ఘటనలో మరో 27 మందికి గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక సైనిక స్థావరంగా వినియోగిస్తోన్న పాఠశాల భవనం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచినట్టు గుర్తించారు. పేలుడు ధాటికి మూడు గదులు కుప్పకూలిపోగా.. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పాకిస్థాన్ తాలిబన్లకు చెందిన తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్థాన్ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించింది. ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం ఇంత వరకూ స్పందించలేదు. పాక్లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అఫ్గన్ నుంచి 2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత పొరుగున ఉన్న తిరుగుబాటు విజయంతో ఇస్లామిక్ యోధులు ధైర్యంగా ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రథమార్ధంలోనే దాదాపు 80 శాతం దాడులు పెరిగినట్టు పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ప్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదించింది. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న పాక్ ఆరోపణలను తాలిబన్లు తరుచూ తోసిపుచ్చుతూనే ఉన్నారు. తాలిబన్ భావజాలాన్ని పంచుకునే తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో పాక్ పెను ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరిలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల రాజధాని పెషావర్ నగరంలో 80 మంది పోలీసుల చావుకు కారణమైన మసీదు బాంబు పేలుళ్ల వెనుక టీటీపీ హస్తం ఉంది. సెప్టెంబరులో దేశీయ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన చిత్రాల్లో వందలాది టీటీపీ ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మరణించారని ఇస్లామాబాద్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa