ఏపీ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త వినిపించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకూ ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీపై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. డిసెంబర్ 18 నుంచి 25లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందించాలని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో ఇది చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. . ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని.. ఈ హక్కులను కాపాడ్డం ప్రభుత్వ బాధ్యతని గుర్తుచేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన రోజునుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసిందని వివరించారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామన్న సీఎం జగన్.. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని అధికారులకు సూచించారు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందని.. ఎలాంటి సమస్యలు వచ్చినా వైయస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందని జగన్ వివరించారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 సైతం చెల్లించాలని సూచించారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలనీ సూచించారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టాలని ఆధికారులను ఆదేశించిన సీఎం.. జనవరి నెలాఖరు నాటికి దీనిని పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చో పెద్దఎత్తున ప్రచారం చేయాలని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని సమీక్షా సమావేశంలో జగన్ సూచించారు. ఈ ప్రచారంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. ఇక ఫేజ్-2 ఆరోగ్య సురక్షను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని.. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించాలని స్పష్టం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలన్న ముఖ్యమంత్రి.. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలని అధికారులను ఆదేశించారు. డయాలసిస్ పేషెంట్లు వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa