ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు అండగా నిలిచారు. తుఫాన్ కారణంగా రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ప్రతి గింజనూ కొనే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందనే భరోసాను రైతుల్లో నింపాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలులో ఉదారంగా ఉండాలని.. నిబంధనలు సడలించైనా రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
రైతుల దగ్గరున్న ధాన్యాన్ని కొని మిల్లర్లకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని..ఆర్బీకేల వారీగా సేకరణ జరుగుతోందన్నారు. పంట నష్టానికి సంక్రాంతిలోగా పెట్టుబడి రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని.. ఉచిత పంటల బీమా పథకం కింద పరిహారంపై అనుసరించాల్సిన ప్రక్రియనూ సమర్ధవంతంగా చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు తుఫాన్ తర్వాత పంటనష్టం గణనపై ఆరా తీశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎన్యూమరేషన్ చేస్తామన్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో జాబితాలను ప్రదర్శిస్తామని అధికారులు వివరించారు. సవరణలు, అభ్యంతరాల స్వీకరణ తర్వాత నెలాఖరునాటికి తుది జాబితాలను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. 26వ తేదీన జిల్లా కలెక్టర్లు పంట నష్టంపై తుది జాబితాలు ప్రభుత్వానికి అందిస్తారన్నారు.
మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్నారు సీఎం జగన్. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని.. సంబంధిత అధికారులకు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. సకాలంలోనే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్నిరకాల చర్యలు చేపట్టామన్నారు. పంట నష్టపోయిన వారికి వైఎస్సార్ ఉచిత బీమా కింద పరిహారం అందజేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa