ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి వెళుతున్నారా.. ఈ సూచనలు పాటించాలన్న టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 08:56 PM

తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు మరో వారంలో ప్రారంభంకానున్నాయి. వైష్ణ‌వాల‌యాల సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం విశిష్ట‌త ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవ‌త్స‌రం అని అర్థం. అదేవిధంగా అక్క‌డ ప‌గ‌లు 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ఉత్త‌రాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ద‌క్షిణాయణం.


వైకుంఠంలో తెల్ల‌వారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణ‌వాల‌యాలలో ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌నం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది న‌మ్మ‌కం.


వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఈ 10 రోజుల‌లో ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ స‌మాన‌మే అని చెబుతోంది టీటీడీ. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌నానికి రావాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేసింది. తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ ప‌ర్వ‌దినాల‌లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు పొందాల్సిందిగా భ‌క్తులలకు సూచనలు చేసింది. గ‌తంలోగానే ఈ ఏడాది కూడా స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్ వీఐపీల‌కు ప‌రిమితంగా మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నానికి అవకాశం ఉంటుంది అన్నారు. అంతేకాదు ఈ 10 రోజుల పాటూ సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు అన్నారు.


వైకుంఠ ద్వార ద‌ర్శ‌న ఫ‌లితం 10 రోజ‌లు పాటు ఉంటుందని టీటీడీ గుర్తు చేసింది. కావున వీఐపీలు, ఇత‌ర భ‌క్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాద‌శి రోజు మాత్ర‌మే ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే తొంద‌ర‌పాటు లేకుండా ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలని కోరింది ద్వార దర్శనానికి సంబంధించి ఆఫ్‌లైన్ టికెట్లను ఈ నెల 22 నుంచి తిరుమల, తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేయనున్న సంగతి తెలిసిందే. మొతకతం 10 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.. 94 కౌంటర్లలో మొత్తం 4,23,500 టోకెన్లు జారీ చేస్తారు.


తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలో ఉన్న ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రామానాయుడు ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమలలో ఉన్న కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద ఈ టికెట్లను‌ జారీ చేస్తారు. అంతేకాదు వైకుంఠ ఏకాదశి దర్శనాల సమయంలో టికెట్లు ఉన్న భక్తును మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. దర్శన టికెట్లు లేని భక్తులు కూడా తిరుమల రావొచ్చు కానీ దర్శనానికి మాత్రం అనుమతించరన్న విషయాన్ని గమనించాలి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa