ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ దూకుడు.. ఎన్నికల కోసం చంద్రబాబు కీలక నిర్ణయం, 18మందికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 09:02 PM

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు దగ్గరకు రావడంతో ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వాటిపై పోరాడేందుకు... అదే సమయంలో వివిధ అంశాలపై టీడీపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు.. పార్టీ ముఖ్య నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన 18 అంశాల్ని ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతను సీనియర్‌ నేతలకు అప్పగించారు. చంద్రబాబు వారితో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అంశాలవారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇప్పటికే ప్రకటించిన మినీ మేనిఫెస్టోని మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. ఈ నెల 17న జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లు వంటి వాటిపై ఆయన నేతలతో చర్చించారు. వెనుకబడిన వర్గాల సమన్వయ బాధ్యతను పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్రలకు అప్పగించారు. నిమ్మల రామానాయుడికి ‘భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమం.. పయ్యావుల కేశవ్‌కు సోషల్‌ మీడియాలను అప్పగించారు. సాగునీటి ప్రాజెక్టుల బాధ్యత బీసీ జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. యువ ఓటర్లను ఆకర్షించడం, వారు ఓటు వేసేలా స్ఫూర్తినింపే కార్యక్రమాల పర్యవేక్షణను రామ్మోహన్‌నాయుడికి కేటాయించారు. ఓటరు జాబితాల పరిశీలన, అధికారపార్టీ చేస్తున్న అక్రమాలపై పోరాటం అంశాల్ని జీవీ ఆంజనేయులుకు, ఉద్యోగులు, పోస్టల్‌ బ్యాలెట్‌ వంటి అంశాల్ని అశోక్‌బాబుకు ఇచ్చారు.


రాజధాని అమరావతి వ్యవహారాలు, ఉద్యమం బాధ్యతను నక్కా ఆనందబాబుకు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ, సర్పంచుల సమస్యలపై పోరాటం అంశాన్ని రాజేంద్రప్రసాద్‌కి అప్పగించారు. పార్టీలోకి చేరికలు అంశాన్ని అనగాని సత్యప్రసాద్‌కి, న్యాయ వ్యవహారాలు, కేసులపై పర్యవేక్షణను ధూళిపాళ్ల నరేంద్రకు అప్పగించారు. బలహీన పోలింగ్‌ కేంద్రాల్ని రవికుమార్‌కి, చంద్రబాబు పర్యటనలకు సంబంధించిన బాధ్యతల్ని పెందుర్తి వెంకటేష్‌కు అప్పగించారు. ప్రభుత్వం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి భవిష్యత్ కు దారిచూపాలన్నారు చంద్రబాబు. కానీ ఈ ప్రభుత్వం మన జీవితాలతో ఆడుకుంటోంది అన్నారు. శుక్రవారం పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీలో చేరారు. తెలుగుదేశానికి అధికారం.. తనకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదని.. జనసేన తో కలిసి టీడీపీ ముందుకురావడానికి కారణం రాష్ట్ర భవిష్యత్ కోసమే అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు.. అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? పది ప్రశ్నలు వేస్తున్నాను.. వాటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.


'1. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు .. తీసుకొచ్చాడా? 22 మంది ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులతో 31 మంది ఎంపీలు జగన్ తో ఉన్నారు. కానీ ప్రత్యేకహోదా తెచ్చాడా? మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చేతలు గడపకూడా దాటడం లేదు.


2. పోలవరం నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పాడు..చేశాడా? రాష్ట్రం సస్యశ్యా మలం కావాలంటే పోలవరం ప్రాజెక్టే మనకు దిక్కు. టీడీపీ ప్రభుత్వం లో 72 శాతం పోలవరం పూర్తిచేశాం. మరలా అధికారంలోకి వచ్చి ఉంటే 2020కి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేసేవాళ్లం. 2020కి పూర్తి కావాల్సిన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థి తి. తెలుగుజాతికోసం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను గాలికి వదిలేశారు. నేను కట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటిని రైతులకు ఇవ్వకుండా జగన్ రెడ్డి జాతి ద్రోహానికి పాల్పడ్డాడు.


3. ఎన్నికలకు ముందు ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు.. ఇప్పటివరకు ఒక్కరికైనా ఉద్యోగమిచ్చాడా? దేశంలోనే ఎక్కువమంది నిరుద్యోగులున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపాడు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 14 సంవత్సరాల్లో 11 డీఎస్సీలు పెట్టి, లక్షా50వేల మంది ఉపాధ్యాయులను సమైక్య రాష్ట్రంలో, విభజనానంతర రాష్ట్రంలో నియమించాం. టీచర్లను నియమించలేదు..ఉన్నస్కూళ్లు మూసేశారు. ఇదీ వీళ్లు సాధించింది. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి.. వారికి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు అందిస్తున్నాడు. ఇన్నేళ్లలో గంజాయి..మాదకద్రవ్యాలపై ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. రాష్ట్రంలో గంజాయి పంట సమృద్ధిగా సాగవుతోంది.


4. మద్యపాన నిషేధం అన్నాడు.. చేశాకే ఓట్లు అడుగుతాను అన్నాడు. దాన్ని ఎందుకు అమలుచేయలేదో చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్ప టి నుంచీ పేదల ఆరోగ్యంతో ఆడుకుంటూ నాసిరకం మద్యం అమ్ముతూ దోచుకుంటున్నాడు. ఆడబిడ్డల మాంగల్యాలు తెంచుతున్నాడు.


5. వారంలో సీపీఎస్ రద్దు చేస్తాను అన్నాడు. ఎన్ని వారాలు అయ్యాయి.. ఎందుకు అమలుచేయలేదో చెప్పాలి.


6. అంగన్ వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? టీడీపీప్రభు త్వంలో వారికి జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాము. నేడు జగన్ రెడ్డి వారు రోడ్లెక్కితే, అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిస్తున్నా డు. టీడీపీ ప్రభుత్వం రాగానే అంగన్ వాడీ సిబ్బందికి న్యాయం చేస్తాం.


7. టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమలుచేస్తే కావాలని విమర్శలు చేశాడు. ఇప్పుడు అదే ఇసుకను అమ్ముకుంటూ భారీ దోపిడీ చేస్తున్నాడు. నేడు ట్రాక్టర్ఇసుకను రూ.5, 6వేలకు అమ్ముతున్నాడు. దాదాపు రూ.40వేలకోట్లు కేవలం ఇసుకలోనే దోచేశాడు.


8. ప్రజా రాజధాని అమరావతి ఏమైంది? ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అనిచెప్పి మాట తప్పాడా..లేదా? సిగ్గులేకుండా మనం కట్టించిన భవనాల్లోనే ఉండి పాలన చేస్తున్నాడు. రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం లేదు. ఈ దుర్మార్గుడు సమైక్య రాష్ట్రంలో 2004లోనే ముఖ్యమంత్రి అయ్యి ఉంటే హైటెక్ సిటీ సహా హైదరాబాద్ కూడా మిగిలేది కాదు. జాతకం బాగుండి.. ఈయన తండ్రి ముఖ్యమంత్రి అయ్యా డు. అమరావతి నిర్మాణం పూర్తై ఉంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోయేవి .. పిల్లలకు మంచి భవిష్యత్ అందేది.


9. మరోపక్క బాదుడే బాదుడని అప్పుడు కూనిరాగాలు తీశాడు. చివరకు ఇప్పుడు ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచాడు. పెట్రోల్..డీజిల్ సహా గ్యాస్ ధరలు పెంచాడు. ఆఖరికి చెత్తపై కూడా పన్నువేసిన చెత్త ముఖ్య మంత్రిగా నిలిచాడు.


10. టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప ఎక్కడైనా రోడ్డు వేశాడా? గ్రామాల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేశాడా? రైతులు ఆనందంగా ఉన్నారా? దేశంలో ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపాడు. రైతులపై ఎక్కువ అప్పులున్న రాష్ట్రం కూడా మనదే. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? పోలీసులు లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ బయటకురాలేని పరిస్థితి. ముఖ్యమంత్రికూడా పరదాలు కట్టుకునే బయటకు వస్తున్నాడు' అంటూ పది ప్రశ్నలు వేశారు చంద్రబాబు.


టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసని.. మరలా అధికా రంలోకి వస్తే ఏంచేయాలో అవన్నీ చేస్తామన్నారు. ఇప్ప్పటికే బాబుష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. 20వ తేదీ తర్వాత నియోజకవర్గాల్లో పర్యటిస్తానని.. ప్రజల్ని కలిసి వారికేం కావాలో ఆలోచించి మరిన్ని హామీలు ఇస్తాం అన్నారు చంద్రబాబు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa