హిందువులు హలాల్ చేసిన మాంసాన్ని తినడం ఆపేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. బిహార్లోని తన సొంత పార్లమెంటు నియోజకవర్గమైన బెగుసరాయ్లో పర్యటించిన గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింల ఆహారపు అలవాట్లపైనా కేంద్ర మంత్రి స్పందించారు. తాను ముస్లింలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ముస్లింలు.. వారి మత ఆచారాల ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారని పేర్కొన్నారు. అలాంటి వారిని తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. మత ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని తినే ముస్లింలను తాను గౌరవిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే హిందువులు వెంటనే హలాల్ మాంసాన్ని తినడం ఆపేయాలని హితవు పలికారు. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఒక్క వేటుతో జంతువును చంపేసి దాని నుంచి వచ్చిన మాంసాన్ని జట్కా మాంసం అంటారు. హిందువులు తమ ఆహార ఆచారాలకు కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రి సూచించారు.
ఈ సందర్భంగా హలాల్ మాంసాన్ని తినం అని ప్రతిజ్ఞ చేయాలని తన మద్దతుదారులను గిరిరాజ్ సింగ్ కోరారు. హిందువులు హలాల్ మాంసాన్ని తిని తమను తాము భ్రష్టు పట్టించుకోకూడదంటూ కేంద్రమంత్రి హితవు పలికారు. ఎల్లప్పుడూ జట్కా మాంసం తినేందుకు కట్టుబడి ఉండాలి అని సూచించారు. ఈ క్రమంలోనే కేవలం జట్కా మాంసాన్ని అమ్మేందుకు మాత్రమే రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసే కొత్త వ్యాపార మార్గాల వైపు మళ్లాలని వ్యాపారులకు కేంద్రమంత్రి సూచించారు. ఈ విషయంపై కొన్ని వారాల క్రితమే బిహార్ సీఎం నితీష్ కుమార్కు కూడా గిరిరాజ్ సింగ్ లేఖ రాశారు. ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లాగా హలాల్ అని లేబుల్ చేసిన ఆహార ఉత్పత్తుల అమ్మకాలపై నిషేదం విధించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. హిందువులు ఖాళీ సమయాల్లో సాయంత్రం పూట దేవాలయాన్ని సందర్శించాలని స్థానికులకు సూచించారు.
ఇక పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని గిరిరాజ్ సింగ్ తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడి.. రైతుల ఉద్యమం లాంటిదేనని పేర్కొన్నారు. ఇందులో కూడా టూల్కిట్ గ్యాంగ్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో దాడి ఘటనపై విచారణ జరుగుతోందని.. ఘటనకు కారణమైన వాళ్లు ఎవరో త్వరలో తేలుతుందని పేర్కొన్నారు. రైతుల ఉద్యమ సమయంలో టూల్కిట్ గ్యాంగ్ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్ ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో తెలుస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa