తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురుపడ్డారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా.. అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ విమానాశ్రయానికి వచ్చారు. రెండు విమానాలు పక్కపక్కనే ఉండి.. పరస్పరం ఎదురుకావడంతో ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్.. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నవశకం తెలుగువారి సొంతం కావాలని, నంబర్ వన్ గా తెలుగుజాతి ఉండాలనేదే తన విజన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో థింక్ గ్లోబల్లీ....యాక్ట్ లోకల్లీ ఉండేదని..కానీ ఇప్పుడు థింక్ గ్లోబల్లీ..యాక్ట్ గ్లోబల్లీ అనేది తన కొత్త నినాదమని పేర్కొన్నారు. చంద్రబాబు బెంగుళూరు టీడీపీ ఫోరం సమావేశంలో మాట్లాడారు. పార్టీలో తాము అన్నిరంగాల వింగ్ లు ఏర్పాటు చేశామని.. కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెంగళూరు ఫోరం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. తనకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా అండగా నిలబడ్డారో ఇప్పుడు ఉత్సాహం చూస్తే కనిపిస్తోంది అన్నారు. తాను చేసిన మంచి పనులు వల్ల తనకు మద్దదతుగా 70 దేశాల్లో ఉన్న తెలుగువారు గుర్తు పెట్టుకుని ముందుకొచ్చి మద్ధతు తెలిపారన్నారు.
రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ ఎందుకు కాకూడు, ఒక కూలీ చేసుకునే వ్యక్తి వారి కొడుకుని ఐటీ ప్రొఫెషనల్ ఎందుకు చేయకూడదు అని ఆలోచించానన్నారు. అందుకే నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టామని.. నాడు ఐటీనీ ప్రారంభించినప్పడు ఎగతాళి చేశారన్నారు. గతంలో ఐటీ అంటే బెంగళూరు మాత్రమే ఉండేది..కానీ బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్ ఉండాలని, నాలెడ్జ్ ఎకానమీతో హైదరాబాద్ ను ప్రపంచం పటంలోనే పెట్టామన్నారు. ముగ్గురిలో ఐటీ ప్రొఫెషనల్ లో మన తెలుగువారు ఒకరున్నారన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలోనే ముందకు వెళ్తున్నామని.. ఫార్మారంగం, బయో టెక్నాలజీతో పాటు ఏ సెక్టార్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కి ఎప్పుడూ ఐటీ బ్యాక్ బోన్ గా తయారైందన్నారు.
బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు వందరోజుల ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను కూడా తీసుకోవాలని.. షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఏం చేయగలుగుతారో ముందే ఆలోచించుకోవాలన్నారు. సొంత గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు ఎవరెళ్తారు ఊర్లకు అనుకోకుండా 10 రోజులు సెలవు పెట్టివెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు. అవసరం అయితే ఇప్పటి నుండే సంపాదించిన డబ్బుల్లో చారిటీకి ఖర్చు పెట్టాలని..రాజకీయాలకు ఖర్చు పెట్టాలి..ప్రజల కోసం గ్రామానికి ఖర్చు పెట్టాలన్నారు. మనిషికి వెయ్యి వేసుకున్నా లక్షల్లో పోగేయవచ్చు..ఆ డబ్బులతో మంచి పనులు చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. తనకు పదవులు, డబ్బులు, లగ్జరీ జీవితం అవసరం లేదన్నారు. తానేం చేశానో తర్వాత తరాలు గుర్తుంచుకోవాలనే పని చేస్తున్నాను అన్నారు. మేథోసంపతితో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలి.. ప్రపంచమే హద్దుగా తెలుగుజాతి ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa