దేశవ్యాప్తంగా మరోసారి కరోనా జనాల్ని వణికిస్తోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశం మొత్తం మీద ప్రతి రోజూ 500కుపైగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. ఏపీలో కేసుల సంఖ్య 119కి చేరింది. ఇంకా పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేసులు బయటపడతాయంటున్నారు. ఈ కేసుల్లో జేఎన్ 1 వైరస్ పేషెంట్లు కూడా ఉన్నారు. పరిస్థితిని బట్టి అవసరమైన వారిని ఆస్పత్రిలో.. మిగిలిన వారిని హోమ్ ఐసోలేషన్లోనే ఉంచుతున్నారు. విశాఖ, విజయవాడ, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, బాపట్ల ఇలా పలు ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణతో పోలీస్తే ఏపీలోనే కేసులు ఎక్కువ.. తెలంగాణలో ప్రస్తుతం 50 కేసులు ఉన్నాయి.
కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్లు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. పండుగలో సమయం కావడంతో మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది. అంతేకాదు జనాలు గుంపులుగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని.. ఒక వేళ వెళ్లాల్సి వస్తే.. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు.. ప్రతీ ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటున్నారు. కరోనా కేసుల పెరుగుతుండటంతో ఏపీలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తం అయ్యారు. అవసరమైన చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు కేరళ, శబరిమల వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వారిపై మానిటరింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమై కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
చలికాలం కావడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. దీంతో రెగ్యులర్గా ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలోను ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్, బెడ్స్, మందులు, పనితీరుపై సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్రం నుంచి శబరిమలకు వెళ్లొచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఆ తర్వాత సంక్రాంతి పండుగ కూడా ఉండటంతో అందర్నీ భయం వెంటాడుతోంది. ముఖ్యంగా పండుగ సందర్భంగా జనాలు గుమ్మిగూడే అవకాశం ఎక్కువగా ఉండటంతో.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa