కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్న్యూస్. రెండో మెట్ల మార్గ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. ఘాట్రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ, కొండపైన పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి..రూ.85 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనను దేవస్థాన పాలక మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2017లోనే ఈ ప్రతిపాదన ఉంది.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. కొండ దిగువన టోల్గేటు నుంచి కొండపైన సెంటినరీ కాటేజీ వెనుక భాగం వరకు మెట్లు నిర్మించడానికి తాజాగా అంచనాలు రూపొందించారు. రత్నగిరికి ఘాట్ రోడ్డు మార్గంలో రోజూ సుమారు 2000 నుంచి 2500 కార్లు, బస్సులు, ఆటోలు, వేలాదిగా బైకులుపై భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే పండుగులు, పర్వదినాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొండపై సరిపడా పార్కింగ్ స్థలం కూడా లేదు.. ఇటీవల కార్తీకమాసంలో పైన పార్కింగ్ చాలక కొండ దిగువనే జూనియర్ కాలేజీ ప్రాంగణంలో వాహనాలను నిలిపివేయాల్సి వచ్చింది. కార్లు మాత్రమే అనుమతించారు.. దేవస్థానం బస్సుల్లో భక్తులను కొండపైకి తరలించారు.
కొండపైకి మరో మెట్ల మార్గం నిర్మిస్తే ఇక్కడ జూనియర్ కాలేజీ ప్రాంగణంలోనే వాహనాల పార్కింగ్కు అవకాశం ఉంది. ఈ ప్రాంగణంలో ఉచిత డార్మెటరీలు కూడా నిర్మించారు. బస్సులు, ఇతర వాహనాలను ఇక్కడే పార్కింగ్ చేసుకుని.. లాకర్లలో సామగ్రి భద్రపర్చుకోవచ్చు. ఈ మెట్ల మార్గంలో వెళ్లడానికి భక్తులు త్వరగా వెళ్లేందుకు వీలుంటుంది అంటున్నారు. ఇప్పుడు బస్టాండ్కు దూరంగా ఉండే.. తొలి పావంచాలుగా వ్యవహరించే ప్రస్తుత మెట్ల మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ ప్రతిపాదన గతంలోనే ఉన్నా అమలు కాలేదు. తిరుమల అలిపిరి మెట్లమార్గం తరహాలో దీనికి షెడ్డు వేయడానికి రూ.40 లక్షలతో ప్రణాళిక చేశారు అధికారులు. నిర్మాణం పూర్తైతే భక్తులకు ఇబ్బందులు ఉండవలు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa