ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్నా విరమించిన ట్యాంకర్ల డ్రైవర్లు.. ఆయిల్ సంస్థల నుంచి బంకులకు పయనం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 09:25 PM

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళనతో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందేమోని ఆందోళనకు గురైన వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. అయితే, ట్రక్కు డ్రైవర్ల ధర్నా విరమించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ధర్నా విరమించి, అయిల్ కంపెనీల్లో ట్యాంకర్లను నింపుకుని బయలుదేరారు. కాసేపట్లో ఈ ట్యాంకర్లు బంకులకు చేరనున్నాయి. హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు చేర్చడంతో వివిధ ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలు, నిరసనలకు దిగారు. మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమోదించిన భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసుల్లో దోషిగా నిర్దారణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ కొత్త నిబంధనలో రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే గరిష్ఠంగా ఈ శిక్ష విధించాలని పేర్కొన్నారు. ఈ నిబంధనను ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల కొత్త వారు ఈ డ్రైవింగ్ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa