మెయితీ, కుకీ తెగల మధ్య వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. దీంతో ఆ రాష్ట్రంలో వరుసగా రెండో రోజు ఘర్షణలు రేగడంతో నలుగురు పౌరులు దుర్మరణం చెందారు. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై దుండగులు మంగళవారం ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు, ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు కాల్పులు జరపగా.. నలుగురు సామాన్య ప్రజలు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా హింసాత్మక ఘటనలు వెలుగు చూడటంతో మణిపూర్లోని 5 జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. తౌబల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మయన్మార్ సరిహద్దు సమీపంలో భద్రతా బలగాలు మంగళవారం గాలింపు ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా సరిహద్దు పట్టణమైన మోరేకు పోలీసు కమాండోలు వాహనాల్లో వెళ్తుండగా.. వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఆకస్మిక కాల్పులకు దిగారు. ఈ ఘటనలో గాయపడిన భద్రతా సిబ్బందికి అస్సాం రైఫిల్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మొదట శనివారం అనుమానిత తిరుగుబాటుదారులు, పోలీసు కమాండోల మధ్య కాల్పులు జరిగాయి. ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగించి భద్రతా సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో మోరే పట్టణంలో హింస చెలరేగగా.. కొందరు వ్యక్తులు రెండు ఇళ్లకు నిప్పుపెట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో ఘటనలో రాజధాని ఇంఫాల్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్పోక్పిలో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక యువకుడ్ని కాల్చి చంపినట్లు చెప్పారు. ఆ యువకుడి హత్యను ఖండించిన మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నిందితులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుక్కుందామని సీఎం పిలుపునిచ్చారు.
అయితే మణిపూర్లో తాజాగా చెలరేగిన హింసాత్మక ఘటనలను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. మణిపూర్లో గత ఏడాది మే 3 వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలు ఉండగా.. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa