కేరళలోని శబరిమల అయప్పస్వామి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ దర్శించుకున్నారు. తెలంగాణకు చెందిన ట్రాన్స్జెండర్ నిషా క్రాంతి శబరిమల సన్నిధానంలో అడుగుపెట్టి.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు ట్రాన్స్జెండర్గా చరిత్ర సృష్టించారు. శబరిమల ఆలయంలోకి ట్రాన్స్జెండర్ ఐడీతో ప్రవేశించేందుకు కేరళ ప్రభుత్వం నిషాకు అనుమతి ఇచ్చింది. విజయన్ సర్కారు అనుమతితో శబరిమల అయ్యప్పస్వామిని జోగిని నిషా ఆదివారం దర్శనం చేసుకున్నారు. శబరిగిరికి చేరుకున్న నిషా.. పదునెట్టాంబడి మీదుగా కాకుండా సాధారణ భక్తులు వెళ్లే మెట్ల మార్గం గుండా ఆలయంలోకి ప్రవేశించారు.
కాగా, శబరిమల ఆలయం ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై జోగిని నిషా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేరళ సర్కార్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకోవడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. కాగా, తెలంగాణలో ఫేమస్ అయిన చెర్వుగట్టు ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు, ప్రతి అమావాస్యకు సైతం జోగిని నిషా హాజరు అవుతారు. అయితే, గతంలో 2018 డిసెంబరు 18న నలుగురు ట్రాన్స్జెండర్లు సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం శబరిమల ఆలయాన్ని దర్శించుకుని చరిత్ర సృష్టించారు. 41 రోజుల పాటు మాల వేసుకుని, తలపై ఇరుముడితో అయ్యప్పను దర్శించుకున్నారు. అయితే, శబరిమల వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. గతంలో మూడుసార్లు వారు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే, 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమలలోకి ప్రవేశం నిషేధం. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa