తిరుమల పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా టీ దుకాణాల్లో మట్టిగ్లాసులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామన్నారు టీటీడ ఈవో ధర్మారెడ్డి. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు. రూ.300 టికెట్లు తీసుకున్నవారు అధికారులు సమన్వయం చేసుకొని క్యూలైన్ లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు చేపడుతున్నారని ఈవో తెలిపారు. వెండి వాకిలి వద్ద నెమ్మదిగా వెళ్లాలని భక్తులకు సూచనలు ఇస్తున్నామన్నారు.
సీనియర్ సిటిజన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు ధర్మారెడ్డి. శ్రీవారి సేవ వెబ్సైట్లో లడూడు ప్రసాద సేవ బుక్ చేసుకునే అవకాశం లేదన్నారు. తిరుమలలో పావురాలు ఎక్కువగా ఉన్నాయని.. ఓ భక్తురాలు ఫిర్యాదు చేయగా.. పావురాల సమస్యను పరిశీలిస్తామన్నారు ఈవో. వసతి గదుల్లో గీజర్ల సమస్యను పరిష్కరిస్తామని.. అన్నదానంలో పరిశుభ్రతను పెంచేలా సిబ్బందికి సూచనలు ఇస్తామన్నారు. వారం రోజుల్లో గదుల కాషన్ డిపాజిట్ తిరిగి భక్తుల ఖాతాకు జమ అవుతుందన్నారు. ఒకవేళ ఫేస్ రికగ్నిషన్ సరిగా లేకపోతే సమస్య వస్తుందని.. ఒకవేళ జమ కాకపోతే మాట్లాడి కాషన్ డిపాజిట్ తిరిగి వచ్చేలా చూస్తామన్నారు.
తిరుమలలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించమన్నారు ఈవో. ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులను వినియోగిస్తున్నామని.. టీ స్టాళ్ల యజమానులతో చర్చించి మట్టి కప్పులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామన్నారు. లడ్డూ నాణ్యత గురించి పోటీ సిబ్బందికి తరచూ సూచనలు ఇస్తున్నామని.. నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తున్నామన్నారు. రోజుకు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామని.. తిరుమలలో పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సంవత్సరంలోపు చంటి పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నాయన్నారు. కంపార్ట్మెంట్లలో పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉందన్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు కలిగిన భక్తులు రాలేకపోతే వాయిదా వేసుకునే అవకాశం లేదన్నారు ఈవో ధర్మారెడ్డి. దర్శనానికి రాలేని పక్షంలో టికెట్లు రద్దు అవుతాయని.. భక్తులు తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు, సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చన్నారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారన్నారు. తిరుమలలోని అన్ని గదులలో గీజర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో పూలు పెట్టుకొని రాకూడదని భక్తులలో మరింత అవగాహన పెంచుతామని ఈవో తెలిపారు. తిరుమల వచ్చే మహిళలు పూలు పెట్టుకోకూడదనే నిబంధన ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తిరుమలలో క్యూ లైన్లు చాలా సంవత్సరాలుగా ఓ పద్దతిలో నిర్వహిస్తున్నామన్నారు ఈవో. భద్రతా కారణాల దృష్ట్యా భక్తులను విధిగా తనిఖీ చేయాలని.. బంగారు వాకిలి వద్ద మూడు వరుసల క్యూ లైన్ చాలా చక్కగా ఉందన్నారు. శ్రీవారి మహిళా సేవకులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని.. ప్రతి రోజూ 80 వేల మంది కంటే ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa