అయోధ్యలో రామ మందిరం నిర్మాణ జరగాలి అనేది దశాబ్దాలుగా.. కోట్లాది మంది హిందువుల కలగా వస్తూ ఉంది. 500 ఏళ్లకు పైగా సాగుతున్న అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం.. 2019 లో సుప్రీం కోర్టు తీర్పుతో శాంతియుతందా సమసిపోయింది. ఆ ప్రాంతం రాముడికి చెందినదేనని.. అక్కడ రామ మందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే అప్పటి నుంచి శరవేగంగా సాగుతున్న అయోధ్య నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి.
ఈ క్రమంలోనే అయోధ్య గర్భగుడిలో కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహాన్ని చూడాలని యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే ఆ శ్రీరాముడి విగ్రహాన్ని ఈ నెల 17 వ తేదీన అయోధ్య నగరంలో ఊరేగింపు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదట నిర్ణయించుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని తాజాగా ట్రస్ట్ ఉపసంహరించుకుంది. అయోధ్య నగరంలో శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయోధ్య గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న బాల రాముడి రూపంలో ఉన్న శ్రీరాముడి విగ్రహ ఊరేగింపును రద్దు చేసినట్లు తెలిపింది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో నగరానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని.. భక్తుల రద్దీ కారణంగానే ఉన్నతాధిధికారుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. భారీగా తరలివస్తున్న భక్తుల మధ్య నుంచి అయోధ్య రాముడి ఊరేగింపు జరిపితే భద్రతా పరంగా సమస్యలు తలెత్తుతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే అదే రోజున రామజన్మభూమి ప్రాంగణంలో ఆ బాల రాముడి కొత్త విగ్రహాన్ని ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. దీంతో అయోధ్య వీధుల్లో రాముడి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆశిస్తున్న నగర వాసులకు నిరాశే ఎదురైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa