ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ పాపులారిటీ పోల్చతూ మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చిక్కుల్లో పడ్డారు. రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని చేసిన వ్యాఖ్యలను హస్తం పార్టీ తీవ్రంగా పరిగణించింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్రమశిక్షణా చర్యల కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ చిదంబరం.. ఈ వ్యాఖ్యలు చేశారు. షోకాజ్ నోటీసులపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ తరఫున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ చిదంబరం మాట్లాడారు. రాహుల్ గాంధీ కంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అని అడిగిన ప్రశ్నకు కార్తీ చిదంబరం స్పందించారు. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని పేర్కొన్న కార్తీ చిదంబరం.. ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ ప్రజాదరణ ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని కార్తీ చిదంబరం చెప్పారు.
ఈ క్రమంలోనే ఓ వైపు ఎన్నికల్లో ఈవీఎం మిషన్ల వాడకం గురించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరోవైపు కార్తీ చిదంబరం వాటికి మద్దతుగా ప్రకటించడం మరింత వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న ఈవీఎం మిషన్ల వాడకాన్ని కార్తీ చిదంబరం మద్దతుగా మాట్లాడటం గమనార్హం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. దీంతో పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎంలపై విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో కార్తీ చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికి నోటీసులు జారీ చేసే అధికారం కేవలం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని కార్తీ చిదంబరం సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa