ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ మేరకు టీచర్లకు ఎన్నికల విధుల బాధ్యతల్ని అప్పగించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా పనిచేసేందుకు అర్హత గలవారి వివరాలను అన్ని ప్రభుత్వశాఖల నుంచి భారత ఎన్నికల సంఘం సేకరిస్తోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుల వివరాలనూ శుక్రవారంలోగా పంపాలని ఆదేశించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి సీఈసీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) పంపిస్తారు.
రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు, వాటిలో అవసరమైన అధికారుల సంఖ్య, అందుబాటులో ఉన్నవారి సంఖ్య తదితర వివరాలు పరిశీలించిన తర్వాత.. ఏయే శాఖల ఉద్యోగులను నియమించాలో సీఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉపాధ్యాయులకూ ఈ బాధ్యతలు ఇవ్వాలని సీఈసీ అనుకుంటే వారూ ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారు. అయితే సీఈసీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాబోయే ఎన్నికల్లో పోలింగ్ అధికారులుగా పనిచేసేందుకు అర్హత ఉన్నవారి కోసం అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల సమాచారాన్నీ ఎన్నికల సంఘం సేకరిస్తుండటంతో తర్వాత ఏం జరగనుందోననే చర్చ ఇప్పుడు రాజకీయ, ఉపాధ్యాయవర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.
ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు అర్హత ఉన్న అధికారులు, సిబ్బంది వివరాలను శుక్రవారానికల్లా పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. జిల్లా పరిధిలో మొత్తం ఎంతమంది పోలింగ్ సిబ్బంది అవసరం?.. ఎన్నికల విధుల నిర్వహణకు ఎంతమంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు? వంటి వివరాలు సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మినహా మిగతా శాఖల సిబ్బంది ఎంతమంది ఉన్నారు?.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం ఎందరు ఉన్నారు? అంశాలతో వివరాలు పంపించాలని కోరినట్లు చెబుతున్నారు.
మరోవైపు ఏపీ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల కల్పన పనులన్నీ ఈ నెల 25 నాటికల్లా పూర్తిచేయాలని సీఎంస్ కేఎస్ జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపుల నిర్మాణం వెంటనే చేపట్టాలని, విద్యుత్తు, ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మద్యం అక్రమరవాణాను అరికట్టడంతో పాటు చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి సూచించారు. ఎన్నికల నేరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల్లో త్వరితగతిన అభియోగపత్రాలు దాఖలు చేయాలన్నారు. కీలకమైన అన్ని కేంద్రాల్లోనూ పోలీసు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa